లక్నో: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తున్నది. ప్రతిరోజు వేల సంఖ్యలో బాధితులు కన్నుమూస్తున్నారు. ఇందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు. దీంతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. హిందీ జర్నలిజం దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన సభలో ఈ మేరకు ప్రకటన చేశారు. జర్నలిస్టులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు.
కరోనా కష్టకాలంలోనూ జర్నలిస్టులు 24 గంటల పాటు పనిచేస్తూ సమాచారాన్ని అందిస్తున్నారని వెల్లడించారు. మహమ్మారి సెకండ్ వేవ్లో దేశవ్యాప్తంగా చాలా మంది జర్నలస్టులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు.