అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలి
మేయర్ వై సునీల్రావు
కార్పొరేషన్, మే 23: నగరంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని మేయర్ వై సునీల్రావు హామీ ఇచ్చారు. నగరంలోని 34వ డివిజన్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, 56వ డివిజన్లో పలు అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, డివిజన్లలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. రోడ్లు, మురుగు కాలువలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు సమస్యలుంటే నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే, ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పటికే స్మార్ట్సిటీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, వీటితో పాటు పట్టణ ప్రగతి నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తామని వెల్లడించారు. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించి మధ్యలో వదిలేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అఖిల్ ఫిరోజ్, ఎంఐఎం నాయకుడు బర్కత్ అలీ తదితరులు పాల్గొన్నారు.