మారేడ్పల్లి, మే 21: అతడికి దేవుడిపై అపారమైన నమ్మకం.. అయితే తనకు డబ్బులు ఇవ్వడం లేదని కోపంతో ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. గుడిలో దొంగతనం చేసి బాగా సంపాదించిన తర్వాత మళ్లీ దేవుడికే ఇచ్చేస్తే తప్పులేదనేది అతడి నమ్మకం. శుక్రవారం పోలీసులకు పట్టుబడిన ఈ ప్రబుద్ధుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన బాలాజీ కుమారుడు మూలే సంతోష్ అలియాస్ రవి (21) ఇంటర్ పూర్తి చేశాడు.
చిక్కడపల్లిలో ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 14న సికింద్రాబాద్ గణపతి ఆలయంలో హుండీని పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లాడు. నిందితుడిని పట్టుకొని విచారించగా, ఎనిమిది ఆలయాల్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇటీవల నీట్ పరీక్ష రాసినా.. అందులో ర్యాంక్ రాలేదు. డాక్టర్ కావాలనుకొని ఇలా దొంగగా మారాడు. దొంగతనానికి వెళ్లే ముందు దేవాలయాలను పరిశీలించి.. అర్ధరాత్రి తర్వాత చోరీకి వెళ్తుండేవాడు. ఆ డబ్బులతో బెట్టింగ్ పెట్టడం మొదలు పెట్టాడు. సగం డబ్బు పోగొట్టుకున్నాడు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.