ఆదిలాబాద్ : జిల్లాలోని జైనథ్ మండలంలోని హట్టిఘాట్ గ్రామంలో నిర్మిస్తున్న అంతరాష్ట్ర చనక-కొరటా ప్రాజెక్టు పంప్హౌస్ పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలోని వ్యవసాయ పొలాలకు సాగునీరు అందించేందుకు, వివిధ పంటలు పండించడంలో రైతులకు అసౌకర్యం రాకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు రామన్న తెలిపారు. ప్రాజెక్టు కల నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు దక్కిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని అధికారులు ఎమ్మెల్యేకు వివరిస్తూ పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. పంప్హౌస్ పనుల సత్వర పూర్తికి చర్యలను వేగవంతం చేసినట్లు చెప్పారు. కాగా లాక్డౌన్ కారణంగా కార్మికుల కొరత పనుల పురోగతికి కొంత ఆటంకంగా మారిందని అధికారులు వెల్లడించారు.