నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 18: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విధించిన లాక్డౌన్ పట్టణాలతోపాటు పల్లెల్లోనూ పకడ్బందీగా అమలవుతున్నది. పోలీసులు, అధికారు లు, లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాకుండా అవగాహన కల్పిస్తున్నా రు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనవసరంగా బయట తిరిగేవారికి జరిమానా విధిస్తున్నారు. జిల్లా కేంద్రంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దుకాణాలను మంగళవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచి అనంతరం మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రోడ్లమీదకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. సరైన ఆధారాలు చూపని వారి వాహనాలను సీజ్ చేశారు. బీబీపేట్ మండలంలో లాక్డౌన్ మంగళవారం ప్రశాంతంగా కొనసాగింది. మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఉదయం 10 గంటల తర్వాత ఏఎస్సై రాములు పోలీస్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా తదితర ప్రాంతాల్లో పట్టణ ఎస్హెచ్వో రామకృష్ణారెడ్డి, పోలీసులు బయట తిరుగుతున్న వారిని ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా బయటికి వచ్చిన వారికి జరిమానా విధిస్తున్నారు. పిట్లం మండల కేంద్రంలో 10 గంటల తర్వాత జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బిచ్కుందలో లాక్డౌన్ సమయంలో రోడ్డుపైకి వచ్చే వాహనదారులను పోలీసులు నిలిపి విచారించారు. ప్రజలెవరూ అనవసరంగా బయటికి రావొద్దని ఎస్సై సాయన్న తెలిపారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు. ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం ఏడోరోజు లాక్డౌన్ అమలును ఎస్సై శ్వేత పరిశీలించారు. పట్టణానికి చెందిన వ్యాపారులు, వివిధ గ్రామాల ప్రజలు లాక్డౌన్ నిబంధనల ప్రకారం నడుచుకోవా లన్నారు. పది గంటల తర్వాత రోడ్లపై ఎవ్వరూ కనిపించకూడదన్నారు. గాంధారి మండలంలో లాక్డౌన్ కారణంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రద్దీ కనిపిస్తున్నది. పెట్రోల్ కోసం బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. 10గంటల తర్వాత ప్రజలు రోడ్లపై అనవసరంగా తిరుగొద్దని ఎస్సై శంకర్ హెచ్చరించారు. నాగిరెడ్డిపేట్ మండలంలో ఉదయం10 గంటల తర్వాత జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. లింగంపేట మండలంలో రెవెన్యూ, పోలీసులు అధికారులు లాక్డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు నిర్ణీత సమయంలో కూరగాయలు విక్రయిస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 10 దాటిన తర్వాత ప్రజలెవరూ బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ వెలవెలబోయాయి. తాడ్వాయి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ఎస్సై కృష్ణమూర్తి అన్నారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామాన్ని మంగళవారం సందర్శించిన ఆయన నిబంధనలు పాటించని వ్యాపారులకు జరిమానా విధించారు.
అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద బందోబస్తు
మద్నూర్, మే 18: లాక్డౌన్లో భాగంగా సలాబత్పూర్ అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద సిబ్బంది వాహనాల తనిఖీ చేపడుతున్నారు. అనుమతి లేని వాహనాలను తిప్పి పంపిస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నందున అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఎస్సై రాజు, ఎంవీఐ శ్రీనివాస్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, వైద్యులు అశ్విన్బాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు
నిజాంసాగర్,మే18: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతామని మల్లూర్ సర్పంచ్ ఖాసీంసాబ్ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో వైస్ ఎంపీపీ మనోహర్తో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. మాస్కు ధరించని వారికి జరిమానా విధిస్తామన్నారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు.