నగరంలో ఇప్పుడు ఎటు చూసినా కరోనా వైద్య సేవల కోసమే అన్వేషణ. ఒకరికి ఆక్సిజన్ కావాలి. ఇంకొకరికి రెమ్డెసివిర్ కావాలి. మరొకరికి వెంటిలేటర్, ప్లాస్మా అవసరం. ఇలా ఆపదలో ఉన్న వారు తమ స్నేహితులకు, బంధువులకు, తెలిసిన వారికి ఫోన్ చేసి ఆ అవసరాల కోసం ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తమ వంతు ప్రయత్నంగా సేవలను ప్రారంభించిన సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూంకు ప్రతిరోజూ 300కు పైగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆక్సిజన్ సిలిండర్లు, ఇంజక్షన్లు, వెంటిలేటర్లు, రక్తం, ప్లాస్మా కోసం దీనంగా వేడుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వీరందరికీ కంట్రోల్ రూం ఆ అవసరాలను తీర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నది. అయితే విజ్ఞాప్తులు వెల్లువలా ముంచెత్తుతున్న ఆపన్నులను ఆదుకునేందుకు మరింత మంది కార్యకర్తలు, సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సైబరాబాద్ పోలీసులు పిలుపునిస్తున్నారు.
కరోనా బాధితుల అవసరాలు తీర్చేందుకు కంట్రోల్ రూం నుంచి పనిచేస్తున్న వారి సంఖ్య వందమందికి చేరింది. వీరు షిఫ్టుల వారీగా 24 గంటలు పనిచేస్తున్నారు. సాయం చేయగలిగిన స్వచ్ఛంద సంస్థలను ఇప్పటికే ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు, ఇంజక్షన్లు, వెంటిలేటర్లు ఇప్పించగలుగుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఎక్కడెక్కడ బెడ్స్ ఉన్నాయో ఆ వివరాలను తెలియజేస్తున్నారు. సైబరాబాద్ పోలీసు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ సంయుక్తంగా కలిసి covid.scsc.inను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక క్లిక్తో వారికి హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్న వైద్య సేవల సమాచారం అత్యంత సులభంగా లభించేలా చేశారు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా అంబులెన్సులు పంపేలా చర్యలు తీసుకుంటున్నారు.