అగ్ర కథానాయికల సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఎనలేని ఆసక్తి ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ కెరీర్కు కొద్దిపాటి విరామం రాగానే వారి తదుపరి సినిమా ఏమిటనే ఉత్సుకత అందరిలో నెలకొంటుంది. అనుష్క, నిత్యామీనన్, త్రిషతో పాటు మరికొందరు స్టార్లు తెలుగు తెరపై సందడి చేసి చాలా కాలమైంది. వారి కొత్త సినిమా ప్రకటన కోసం ఇండస్ట్రీతో పాటు అభిమానులు నిరీక్షిస్తున్నారు. ఈ అగ్రనాయికలు మాత్రం మనసుకు నచ్చిన మంచి కథ దొరికే వరకు వేచిచూసే ధోరణి ఉత్తమమని భావిస్తున్నారు.
చెన్నై సొగసరి త్రిష స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసి చాలా కాలం అవుతోంది. గత కొన్నేళ్లుగా తమిళ సినిమాలపై దృష్టిసారిస్తున్న ఆమె టాలీవుడ్కు దూరంగా ఉంటుంది. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్గా తొలుత త్రిషను తీసుకున్నారు. సెట్స్లో అడుగు పెట్టకుండానే సృజనాత్మక విభేదాలతో ఈసినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్ల్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విరామంలో టాలీవుడ్ నుంచి కొన్ని అవకాశాలు వచ్చినా కథలు నచ్చక ఆ సినిమాల్ని త్రిష తిరస్కరించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ నుంచి పిలుపు కోసం ఈ సుందరి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’పైనే త్రిష ఆశలన్నీ పెట్టుకొంది.ఇందులో చోళ యువరాణి కుందవి పాత్రలో ఆమె కనిపించబోతున్నది. ఈ సినిమా తనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తోంది.
బాలీవుడ్లో వరుస సినిమాల్ని అంగీకరిస్తున్న పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ప్రీత్సింగ్ తెలుగులో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది రకుల్. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి చాలా రోజులు గడుస్తున్నా తెలుగులో మరో సినిమాపై సంతకం చేయలేదామె. తెలుగులో కొత్త కథలు వింటున్నానని, కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని అంటోంది ఈ సొగసరి. రకుల్ ధోరణి చూస్తుంటే తెలుగులో కొత్త సినిమాను ఇప్పట్లో ప్రకటించే సూచనలు కనిపించడం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
దక్షిణాదిలో రాశి కంటే వాసికే ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చే నాయికల్లో నిత్యామీనన్ ముందువరుసలో నిలుస్త్తుంది. పదకొండేళ్ల తెలుగు సినీ ప్రయాణంలో పదిహేనుకు మించి సినిమాలు చేయలేదామే. అభినయానికి ఆస్కారమున్న విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్న నిత్యామీనన్ తెలుగులో బిగ్స్క్రీన్పై కనిపించి రెండేళ్లు దాటింది. ఇటీవలే ‘నిన్నిలా నిన్నిలా’ అనే ఓటీటీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె వెండితెరపై కనిపించేది ఎప్పుడనేది ఆసక్తిగా మారింది. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రాన్ని పవన్కల్యాణ్, రానా కథానాయకులుగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసింది. ఈసినిమాలో పవన్కల్యాణ్కు జోడీగా నిత్యామీనన్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే తొందరలోనే నిత్యామీనన్ నుంచి తెలుగు సినిమా ప్రకటన వెలువడటం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.
‘నిశ్శబ్దం’ తర్వాత సినిమాల ఎంపికలో పూర్తిగా స్లైన్స్ను పాటిస్త్తుంది అనుష్క. ఆమె తదుపరి సినిమా ఏమిటనేది ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో అతిథిగా నటించిన ఆమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు. అనుష్క నాయికగా ఎన్నో అంచనాలతో రూపొందిన ‘నిశ్శబ్దం’ చిత్రం కరోనా కారణంగా గత ఏడాది డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మాత్రమే విడుదలైంది. దాంతో ఆమెను బిగ్స్క్రీన్పై చూడాలని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ‘నిశ్శబ్దం’ ఫలితంతో కథల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న అనుష్క ఈ సినిమా విడుదలై ఏడాది దాటినా తెలుగుతో పాటు తమిళంలో కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు. తెలుగులో అనుష్క, నవీన్పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఓ ప్రేమకథా చిత్రం రూపొందబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘సైరా నరసింహారెడి’్డ తర్వాత నయనతార తెలుగులో ఏ సినిమాను ఒప్పుకోలేదు. తమిళంలో మహిళా ప్రధాన చిత్రాలు, చాలెంజింగ్ పాత్రలపై దృష్టిపెడుతున్న ఆమె తెలుగులో అలాంటి కథల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది.