కొత్తూరు, ఏప్రిల్ 24 : ‘కొత్తూరు ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉంది.. సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే అభివృద్ధి చెందుతుంది.. కారుగుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధికి చిరునామాగా కొత్తూరును మారుస్తాం’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి మంత్రి 8, 9, 10, 11, 12 వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 8వ వార్డు అభ్యర్థి లావణ్య దేవేందర్ యాదవ్, 9వ వార్డు అభ్యర్థి గోవింద్రెడ్డి, 10వ వార్డు అభ్యర్థి కరుణ సుదర్శన్ గౌడ్, 11వ వార్డు అభ్యర్థి ప్రసన్నలేఖ యాదవ్, 12వ వార్డు అభ్యర్థి డోలి రవీందర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.2 వందలు ఇచ్చిన పింఛన్ను రూ. 2 వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. దివ్యాంగులు, ఒంటిరి మహిళలకూ పింఛన్ ఇస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్, అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిందన్నారు. కొత్తూరును అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అడుగగానే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీని చేశారన్నారు.
కొత్తూరులో ఖాళీ స్థలం చూపిస్తే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. త్వరలో పేదలందరికీ రేషన్ కార్డులు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, 12 వార్డుల అభ్యర్థులు, ఇన్చార్జ్లు పాల్గొన్నారు.