మియాపూర్, ఏప్రిల్ 21 : కేవలం పారిశుధ్య కార్మికుల కృషితోనే పూర్తిస్థాయి స్వచ్ఛ పరిసరాలు నెలకొల్పటం కష్టమని, ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ప్రస్తుతం కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నందున స్వచ్ఛతను మరింత ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్లో బుధవారం కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి విప్ గాంధీ స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుందరమైన నగరం కోసం బల్దియా ఎంతగానో కృషి చేస్తున్నదని, ఇందుకోసం డస్ట్బిన్లను తొలగించి స్వచ్ఛ ఆటోల సేవలను మరింతగా విస్తృతం చేసిందన్నారు. తడి పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చేసి నేరుగా ఇంటివద్దకు వచ్చే స్వచ్ఛ ఆటోకు మాత్రమే అందివ్వాలని, నిర్లక్ష్యంగా రహదారులు, నాలాల్లో పడేయవద్దని గాంధీ కోరారు. డస్ట్ బిన్ రహిత నియోజకవర్గమే లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నట్లు, తమ సంపూర్ణ తోడ్పాటును అందించాలని ఆయన పిలుపునిచ్చారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో స్వచ్ఛ పరిసరాలే ఆరోగ్యాన్నందిస్తాయని విప్ గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, వెంకట్రావు, సంతోష్కుమార్, వాసు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.