చండీఘడ్ : కరోనా కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాలకు డిమాండ్ పెరిగింది. ఫరీదాబాద్ కు తరలిస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ ను ఢిల్లీ ప్రభుత్వం లూటీ చేసిందని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ ఆరోపించారు. ఈ ఘటన నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లకు పోలీసు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీకి మంగళవారం బలవంతంగా తాము ఆక్సిజన్ అందించాల్సి వచ్చిందని అన్నారు.
ముందుగా తమ అవసరాలు తీరిన తర్వాత ఇతరులకు ఆక్సిజన్ సరఫరా చేస్తామని, నిన్న ఫరీదాబాద్ తరలిస్తున్న రెండు ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒక ట్యాంకర్ ను ఢిల్లీ కొల్లగొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమకు తక్షణమే ఆక్సిజన్ సరఫరాలు పెంచాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ఉత్పత్తి డిమాండ్ కు అనుగుణంగా పెంచేందుకు చర్యలు చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.