హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)ః సెకండ్వేవ్ రూపంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్నది. ఐదు రెట్ల వేగంతో విస్తరిస్తున్నది. మరణాల సంఖ్య బాగా పెరుగుతున్నది. మొన్నటివరకు జీహెచ్ఎంసీ, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పరిధికే పరిమితమైన వైరస్ వ్యాప్తి గడిచిన వారంలో అన్ని జిల్లాల్లోనూ తీవ్రమైంది. గ్రామీణ జిల్లాల పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం కట్టడి చర్యలను తీవ్రతరం చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేసింది. ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసింది. గడిచిన వారంలో ఒక్క జీహెచ్ఎంసీలోనే 4,151 కేసులు నమోదు కాగా, కామారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ అర్బన్లో రోజుకు వందదాకా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో కేవలం ఏడు రోజుల్లోనే 5 రెట్ల వేగంతో వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ ధరించడం, ఇండ్ల్లు దాటకుండాఉండటం, శుభ్రత పాటించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 363 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయగా, అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నిజామాబాద్లో 58 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. హైదరాబాద్లో 52, నిర్మల్లో 23, రంగారెడ్డిలో 21, వికారాబాద్లో 19, మేడ్చల్, ఖమ్మం, కుమ్రంభీం జిల్లాలో 18 ఇతర జిల్లాల్లో 15 కంటే తక్కువగా కంటైన్మెంటు జోన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సైర్వెలెన్స్ పెంచడం, పెద్ద సంఖ్యలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రాంతం 19 18 17 16 15 14 13
జీహెచ్ఎంసీ 793 705 743 598 505 446 361
నిజామాబాద్ 444 360 367 314 303 279 187
కామారెడ్డి 262 115 232 184 144 128 57
ఖమ్మం 247 113 149 149 124 78 68
వరంగల్ అర్బన్ 208 146 175 136 114 86 64
మంచిర్యాల 188 111 124 121 101 75 51
సంగారెడ్డి 184 264 232 235 175 153 135