ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్న విద్యాశాఖ
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పనితీరును తెలుసుకొనేందుకు విద్యాశాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్రం తీసుకొచ్చిన టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ రుబ్రిక్స్(టీఎస్ఏఆర్)ను అమలుచేస్తున్నది. ఉపాధ్యాయులు తమ పనితీరును తామే మదింపు చేసుకొని, రేటింగ్స్ ఇచ్చుకొనే ఈ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలుచేయనున్నారు. రాష్ట్రంలో 1.16 లక్షల మంది టీచర్లు పనిచేస్తుండగా, స్వీయ మదింపును నిర్వహించుకోవడంపై విద్యాశాఖ అధికారులు ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నారు. జూమ్ యాప్ ద్వారా రెండురోజులపాటు నిర్వహించే ఈ శిక్షణ శుక్రవారం, శనివారం కొనసాగనున్నది. స్వీయ మదింపులో భాగంగా యాప్ను అభివృద్ధిచేయగా, 47 ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రాన్ని పంపించనున్నారు. టీచర్లు తమ పనితీరుకు తామే రేటింగ్స్ ఇచ్చుకొనే వెసులుబాటు కల్పించారు. ఉపాధ్యాయులు అంతర్మథనం చేసుకోవడానికి, గుణాత్మక విద్యనందించేందుకు, బలాలు, బలహీనతలు, పొరపాట్లను గుర్తించేందుకు వృత్తిపరమైన సవాళ్ల్లను అదిగమించేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.