గ్రేటర్లో టీఆర్ఎస్ వినూత్న ప్రచారం
సరికొత్త కార్యక్రమానికి చీఫ్ విప్ దాస్యం శ్రీకారం
పశ్చిమ నియోజకవర్గంలో ఆరంభం
వరంగల్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘గులాబీ జెండా.. గుండెల నిండా’ ఇది టీఆర్ఎస్ ఎన్నికల నినాదం. గ్రేటర్ వరంగల్ ఎన్నికల వేళ ఇక్కడి నేతల ఆలోచనతో కొత్త నినాదం వినిపిస్తోంది. ఒకప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్గా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావంఅనంతరం టీఆర్ఎస్ సర్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. ఈ తరుణంలో ప్రగతి పనులను ప్రజలకు వివరించేందుకు పశ్చిమ నియోజకవర్గంలో సరికొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ‘ఇంటి పై జెండా.. బండికి జెండా’ పేరుతో ప్రభుత్వ చీఫ్విప్ దా స్యం వినయ్భాస్కర్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చు ట్టారు. ప్రతి కార్యకర్త.. తన ఇంటిపై గులాబీ జెండా ఎగురవేయడంతో పాటు మోటరు సైకిల్ లేదా కారుకు జెండా ను పెట్టుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎన్ని కల ప్రచారం మొదలు పోలింగ్ ముగిసేదాకా ఈ కార్యక్ర మం సాగేలా ప్రణాళికలు రూపొందించారు.
రాష్ట్రంలో అ మలవుతున్న పథకాలు, ఆరున్నరేండ్లుగా వరంగల్ మహానగరంలో జరిగిన అభివృద్ధి పనులపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలనే లక్ష్యంతో చీఫ్విప్ వినయ్భాస్కర్ ఈ కొత్త విధానం తీసుకొచ్చారు. వారం క్రితం జరిగిన పశ్చిమ నియోజకవర్గ సన్నాహక సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోగా, ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేసి ‘జెండా’ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా ‘ఇంటి పై జెండా… బండికి జెండా’ పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహించడం వల్ల టీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఒక్కరిలోనూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు.. గ్రేటర్ అభివృద్ధిపై చర్చ జరుగనుంది. ఫలితంగా టీఆర్ఎస్ సర్కారు నగరానికి చేసిన అభివృద్ధి ఏమిటి?, గత ప్రభుత్వాలు నగరాభివృద్ధిపై చూపిన నిర్లక్ష్యం ఎంత? అనే విషయాలను ప్రజలు బేరీజు వేసుకునే అవకాశముంది.
వినూత్న ప్రచారం..
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో, అలాగే తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ తెలిసేలా.. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. బస్తీబాట, అపార్ట్మెంట్ విజిట్ పేరుతో నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు మొక్కలను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ రహిత నగరం లక్ష్యంగా పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసులను మాత్రమే వినియోగించేలా అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అంతేగాక మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన ‘ప్రతి ఆదివారం.. పరిశుభ్ర నగరం’ పిలుపందుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లోని చెత్తను తొలగించేలా వరుస కార్యక్రమాలు చేపట్టారు. ఇంకుడుగుంతల నిర్మాణంపైనా నగరవ్యాప్తంగా అవగాహన కలిగించేలా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వరంగల్లో నిర్వహించిన ‘ప్రగతి నివేదన సభ’కు ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా రావాలని ఇంటింటికీ వెళ్లి ఆహ్వానించారు. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరిలో చర్చ జరిగేలా కొత్తగా ‘ఇంటిపై జెండా.. బండికి జెండా’ ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆహా! ఎంత అద్భుతంగా పాడారు ఈ పిల్లలు
మంత్రి కేటీఆర్ను కలిసిన సాఫ్రాన్ సంస్థ బృందం