న్యూఢిల్లీ: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం, వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న వేళ ఇండియాకు కాస్త ఊరట కలిగించే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం ముగిసే నాటికి దేశంలో మరో ఐదు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వీటికి అదనంగా రష్యాకు చెందిన స్పుత్నిక్ వి, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ (బయోలాజిక్ ఇ ద్వారా), నొవావాక్స్ వ్యాక్సిన్ (సీరమ్ ద్వారా), జైడస్ కాడిలా వ్యాక్సిన్, భారత్ బయోటెక్కు చెందిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మొత్తంగా 20 వరకూ వ్యాక్సిన్లు క్లినికల్ ప్రయోగ దశలో ఉన్నాయి. అందులో స్పుత్నిక్ వికి ముందుగా అనుమతి లభించే అవకాశాల ఉన్నాయి. మరో పది రోజుల్లోనే స్పుత్నిక్ వికి గ్రీన్సిగ్నల్ రావచ్చనీ ఆ వర్గాలు తెలిపాయి. ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్తోపాటు హెటెరో బయోఫార్మా, గ్లాండ్ ఫార్మా, స్టెలిస్ బయోఫార్మా, విక్రో బయోటెక్ ఈ స్పుత్నిక్ విని తయారు చేస్తున్నాయి. దేశంలో 85 కోట్ల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను తయారు చేసే సామర్థ్యం ఉండటం చాలా పెద్ద ఊరటగా చెప్పవచ్చు.
స్పుత్నిక్ వి జూన్లోగా అందుబాటులోకి రావచ్చు. ఇక జాన్సన్ అండ్ జాన్సన్కు చెందిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా ఆగస్ట్ నాటికి రావచ్చని, నొవావాక్స్ సెప్టెంబర్లో, ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.