కరీంనగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకనాడు కరువునేల. తాగు, సాగునీటికి దశాబ్దాలపాటు తండ్లాడిన మెట్టప్రాంతం. వర్షాలు, బోరుబావులపైనే ఆధారపడి ఎవుసం చేయాల్సిన పరిస్థితి. యాసంగిలో చుక్క నీరు లేక భూములను బీళ్లుగా వదిలేయాల్సిన దయనీయ స్థితి. వాగులూ వంకలు ఎండి మూగజీవాలు తండ్లాడిన దుర్భర పరిస్థితి. స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. కాళేశ్వరం ఎత్తిపోతలతో సరికొత్త అధ్యాయం మొదలైంది. మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. మానీటితో మెట్టను అభిషేకిస్తానని తాను హామీ ఇచ్చినట్లుగానే ఇప్పుడు జిల్లాకు గోదావరిని మళ్లిస్తున్నారు. మండుటెండల్లోనూ జలాలు తరలివస్తుండగా, రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. చెరువులు మత్తళ్లు దుంకుతుండగా, జలాలను చూసి సంబురపడుతున్నారు.
చెరువులకు జలకళ..
ఎల్లంపల్లి పంప్హౌస్ నుంచి కాళేశ్వర జలాలు వేములవాడ నియోజకవర్గానికి తరలిస్తున్నాయి. ముందుగా ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు, అక్కడి నుంచి ఈ నియోజకవరానికి పంపిస్తున్నారు. వేములవాడ రూరల్, అర్బన్, చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి మండలాల్లో 21వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, 41 చెరువులు నింపారు. ఇప్పటికే చెరువులు మత్తడి దుంకుతుండగా, వేములవాడ రూరల్ మండలంలోని నక్కవాగుకు జలకళవచ్చింది. హన్మాజీపేటలో వంతెనపై నుంచి ప్రవహించింది. దానిపై నుంచి వెళ్తున్న సమీప గ్రామాల ప్రజలు ఆ నీటిని నెత్తిపై చల్లుకొని గోదారమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, నాయకులు జింకె శ్రీనివాస్, గోస్కుల రవి, జంకె మధు, కమలాకర్ ప్రత్యేక పూజలు చేశారు.
ముస్తాబాద్ మురిసె..
ముస్తాబాద్ మండలం ఒకనాడు సాగునీటి వనరులు లేక తండ్లాడింది. వర్షాలు, బోరుబావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసింది. యాసంగిలో చుక్క నీరు లేక.. పంటలు పండక.. ఉపాధి కోల్పోయిన ఎంతో మంది రైతులు, యువత గల్ఫ్ దేశాలకు వలస బాట పట్టారు. కానీ, స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ చొరవతో నీటిగోస తీరుతున్నది. సిద్దిపేట జిల్లా తొగుట వద్ద తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి గత నెల 3వ తేదీన ప్రారంభమైన కాళేశ్వర జలాలు దుబ్బాక మండలం రాజక్కపేట కెనాల్ ద్వారా 35 కిలోమీటర్లు ప్రయాణించి, 5వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ముస్తాబాద్ మండలానికి చేరాయి. మొదట మద్దికుంట ఊరచెరువుకు, తర్వాత చీకోడులో చింతల చెరువును తాకాయి. తాజాగా మంగళవారం ముస్తాబాద్ పెద్దచెరువు, మద్దికుంట ఊర చెరువు మత్తడి దుంకగా, రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఎగువ నిండే..
మల్లన్నసాగర్ పంప్హౌస్ నుంచి గోదావరి జలాలను గత నెల 27న కొండ పోచమ్మ కెనాల్ ద్వారా కూడవెల్లి వాగుకు విడుదల చేశారు. అవి ఆ వాగుపై నిర్మించిన 39 చెక్డ్యాంలను దాటుకుంటూ ఎగువ మానేరు వైపు తరలివచ్చాయి. 800 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో 28వ తేదీన 1300 క్యూసెక్కులకు పెంచారు. రెండు టీఎంసీల సామర్థ్యమున్న ఈ జలాశయం, వారం నుంచి వస్తున్న జలాలతో నిండుకుండలా మారుతున్నది. పూర్తి సామర్థ్యం 31 అడుగులకు గాను, ప్రస్తుతం 26 అడుగులకు చేరుకున్నది. మరో వారంలో మత్తడి దూకనుండగా, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఎగువమానేరు దిగువ ఉన్న చెరువులను నింపుతున్నారు. ఐదు రోజుల క్రితం నుంచి ఎడమ కాలువ ద్వారా జలాలు వదులుతున్నారు. మొదట గర్లకుంట చెరువును, అక్కడి నుంచి వెంకటాద్రి చెరువును నింపారు. ప్రస్తుతం గర్లకుంట నుంచి పెద్దకాలువ ద్వారా తాళ్ల చెరువుకు నీటిని పంపిస్తున్నారు. మొత్తంగా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లోని 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వనుండగా, ఆయకట్టు రైతులు సంతోషపడుతున్నారు. మండుటెండల్లోనూ ఎగువమానేరు నిండుకుండలా మారడంతో సంబురపడుతున్నారు. భూగర్బ జలాలు పెరుగుతాయని ఆనందపడుతున్నారు. పొట్ట దశలో యాసంగి పంటలు జీవం పోసుకుంటాయని సంతోషపడుతున్నారు.
ఇల్లంతకుంటకు జలసిరి..
ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి గ్రామ శివారులో నిర్మించిన అన్నపూర్ణ ప్రాజెక్టు సర్ఫేస్ గేటు ద్వారా వారం క్రితం నీటిని విడుదల చేయడంతో కాళేశ్వర జలాలు పరుగులు తీశాయి. ఒర్రె ద్వారా మూడు కిలోమీటర్లు ప్రవహించి అనంతారం చెరువుకు చేరుకున్నాయి. మంగళవారం తెల్లవారుజామున మత్తడి దుంకగా, దిగువ బిక్కవాగుకు పరుగులు పెట్టాయి. మరో మూడు నాలుగు రోజుల్లో 15కిలోమీటర్లకుపైగా ప్రవహించి, పొత్తూర్ శివారులోని మానేరు వాగులో కలువనున్నాయి. బిక్కవాగు సమీప 15 గ్రామాల పరిధిలో భూగర్భజలాలు పెరుగుతాయి. అనంతారం చెరువుతో 500 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. నట్టనడి ఎండల్లో నీళ్లు రావడంతో మండల రైతులు సంబురపడుతున్నారు.
ఇది రైతు ప్రభుత్వం..
రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. నట్టి ఎండల్ల వాగులు పారించి పంటలను కాపాడిండు. రైతులకు అండగా ఉండి సాగు, తాగు నీటి సమస్య రాకుండా చూస్తూ రైతు బాంధవుడిగా మారిండు. గత యాసంగిల అందరం ఎకరం, రెండెకరాలు మాత్రమే ఏసినం. ఈ ప్రాజెక్టులు అచ్చినంక మొత్తం సాగుచేత్తన్నం. ప్రాజెక్టు నిర్మాణం వల్లే మండలంలో వరి సాగు పెరిగింది.
దశాబ్దాల కల నెరవేరింది..
కరువు నేలకు గోదావరి జలాలు రావడం ఓ చరిత్రే. దశాబ్దాల కల నేరవేరింది. గోదావరి జలాలతో మెట్ట ప్రాంతమైన ముస్తాబాద్ మండలానికి ఇక జీవం వచ్చినట్లే. మండుటెండల్లో బావుల్లో నీరు తగ్గి కండ్ల ముందే పంటలు ఎండుతున్న సమయాన జలాలు రావడం సంతోషంగా ఉంది. మండలంలోని సుమారు 25 వేల ఎకరాలకు మేలైతది. మాట ఇచ్చి నిలబెట్టుకున్న దమ్మున్న నాయకుడు కేటీఆర్. ఆ సారుకు మండల ప్రజలు రుణపడి ఉండాలి.
-జనగామ శరత్రావు, ఎంపీపీ (ముస్తాబాద్, ఏప్రిల్ 7)
దేవునోళే నీళ్లు పంపిండు..
నాకు ఊళ్లే ఎకురం భూమి ఉంది. నీళ్లు లేక ఏనాడూ పండలే. నాలెక్కనే ఎంతో మంది ఏండ్లుగా అరిగోసపపడుతున్నరు. ఈ సారి వర్షాలు పడ్డయని వరేసిన. నా తోటొళ్లు వేసిన్రు. కానీ ఏం పాయిదా. ఎండలు ముదరవట్లే. నీళ్లేమో లేకపాయె. పంటలు ఎండిపోయే స్థితికచ్చింది. నీళ్లత్తయో రావో అనుకున్నం. కానీ కేటీఆర్ సార్ దేవునోళె ముస్తాబాద్ చెరువులకు కాళేశ్వరం నీళ్లు పంపి మమ్ముల కాపాడిండు. ముస్తాబాద్ చెరువుల ఎండకాలంల ఎప్పుడు గిన్ని నీళ్లు చూడలే. మండలానికి పెద్ద చెరువే పెద్ద దిక్కు. చాలా ఆనందంగా ఉంది. సార్కు ధన్యవాదాలు.
ఎక్కడి గోదావరి.. ఎక్కడి మానేరు
సీఎం మాట ఇచ్చిండు. కేటీఆర్ సార్ నర్మాల మానేరుకు నీళ్లు తెచ్చిండు. ఎక్కడి గోదారి.. ఎక్కడి మానేరు. గోదారి నీళ్లు మానేరుకు అత్తున్నయంటే నమ్మలేకపోయిన. చానా సంబురమైతంది. యాసంగికి ఇక ఏ బాధా ఉండది. నీళ్లు పుష్కలంగా అత్తున్నయి. మానేరు నిండితే వానాకాలంల వానలతో పని లేదు. మొత్తం నాట్లు ఏసుకుంటం. కేసీఆర్, కేటీఆర్ సార్ల పుణ్యమాని ఇగ రెండు పంటలు ఏత్తం.
రుణపడి ఉంటం..
కాళేశ్వరం 9వ ప్యాకేజీ లేటైతందని మంచి ఆలోచన చేసిన్రు. మంత్రి కేటీఆర్ చొరవతోనే కొండ పోచమ్మ కెనాల్ నుంచి కూడెళ్లి వాగు ద్వారా ఎగువ మానేరుకు నీళ్లత్తన్నయి. ఆయకట్టు రైతులకు ఏ ఇబ్బంది ఉండదు. ఎండా కాలంలో మానేరు నిండుగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టం. మెట్ట ప్రాంతాలకు సాగు నీరు తెచ్చిన మంత్రి కేటీఆర్కు రైతులందరం రుణపడి ఉంటం.
జీవ గంజి పోసినట్లయింది..
కాళేశ్వరం నీళ్లతో ఎండుతున్న పంటలకు జీవగంజి పోసినట్లయింది. యాసంగి మొదట్ల వ్యవసాయ బావులలో నీరు ఉంటే వరి నాట్లు వేసినం. తీరా పంట చేతికి అందే టైంకు నీరు లేక ఇబ్బందులు పడ్డం. గప్పుడే మిడ్మానేరు నుంచి నీళ్లు ఇడిసిన్రు. అనంతారం చెరువు నిండి మత్తడి దూకి బిక్కవాగుల నీళ్లు చేరినయి. మా బావుల్ల కూడా నీళ్లు పెరిగినయి. నా మూడెకరాలకు పుష్కలంగా నీళ్లందుతున్నయి. కేటీఆర్ సార్కు కృతజ్ఞతలు.
ఎండల్ల పారుడు ఎన్నడూ చూడలే..
మండుటెండల్ల బిక్క వాగు పారుడు ఎప్పుడూ చూడలేదు. ఎక్కడి గోదారి నీళ్లు ఎక్కడి అనంతారం చెరువు. రైతుల పంటలు ఎండి పోకుండా ఉండాలనే గంగమ్మ తల్లిని ఇక్కడికి తెచ్చిన కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం. పుట్టి ఇన్ని ఏండ్లయింది కానీ, ఎండ కాలంలో వాగు పారుడు కేసీఆర్ సార్ దయతోనే సూత్తున్న.
నీళ్లుంటనే మాకు బతుకు..
చెరువు, కుంటల్లో పుష్కలంగా నీళ్లు ఉంటనే మాకు బతుకు. లేదంటే ఇంటిల్లిపాది కడుపు మాడుసుకునుడే. మేం చేపలు పట్టుకొని అమ్ముకుంటనే ఇంత బువ్వ దొరుకుతది. ఇన్నాళ్లు చెరువులు, కుంటల్ల నీరు లేక ఉపాధి కోసం బతకవోయినం. ఇప్పుడు నీళ్లు రావడం సంతోషంగా ఉంది. బతుకుదెరువు దొరుకుతది. సారు సల్లంగ ఉండాలి.