మోసపోయిన చోటే సంపాదించాలనుకొని ఆన్లైన్ ట్రేడింగ్లో సైబర్నేరగాళ్లు మోసాలకు తెరలేపారు. హైదరాబాద్ అబిడ్స్కు చెందిన ఓ మహిళకు ఫేస్బుక్లో పరిచయమై, తాము ట్రేడింగ్లో భారీ లాభాలు అర్జించి పెడుతామంటూ నమ్మించారు. ఆమె వద్ద నుంచి రూ.1.2 కోట్లు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులు రాహుల్ సిరస్వాల్ అలియాస్ రాహుల్, మహేశ్దేవ్లను నాలుగు రోజుల కిందట హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరిని రెండు రోజుల పాటు విచారణ కోసం ఇన్స్పెక్టర్ వెంట్రామిరెడ్డి బృందం కస్టడీలోకి తీసుకొని విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సుమిత్ వర్మ నేతృత్వంలో పెట్టుబడులు పెట్టండి, ట్రేడింగ్లో భారీ లాభాలు ఆర్జించి పెడుతామంటూ ప్రచారం చేసుకున్నారు. సుమిత్ వర్మతో పాటు మరో ఆరుగురు ఒక గ్యాంగ్గా ఏర్పడ్డారు. సుమిత్ వర్మ గతంలో షేర్మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి గుర్తుతెలియని వ్యక్తులు ఇతడికి రూ.40 లక్షల వరకు మోసం చేశారు. పోయిన సొమ్మును తిరిగి రాబట్టుకోవడం కోసం సుమిత్ వర్మ మోసగాడిగా అవతారమెత్తాడు. దీంతో ముంబాయి స్టాక్ మార్కెట్లో తాము ట్రేడింగ్ చేస్తున్నామని ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలిస్తామంటూ నమ్మిస్తూ మోసాలు చేస్తున్నారు. సుమిత్ అతని మేనల్లుడైన ఫతేరి, అజిత్తో పాటు రాహుల్, మహేశ్దేవ్ మరికొంత మందితో కలిసి గ్యాంగ్ను ఏర్పాటు చేసి ఒక కాల్సెంటర్ను నిర్వహిస్తున్నాడు.
టెలీకాలర్స్తో అమాయకులకు ఫోన్లు చేయిస్తూ వల వేస్తుంటారు. ముందుగా ఫేస్బుక్లో వివిధ ఐడీలతో ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టండంటూ ఫోన్ నంబర్ను, ఒక వెబ్సైట్ అడ్రస్ను కూడా ఇస్తున్నారు. ట్రేడ్ 24 పేరుతో వెబ్సైట్ను ఏర్పాటు చేసి అందరిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫేస్బుక్లో సాక్షి మెహత ఐడీతో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసిన అబిడ్స్కు చెందిన మహిళ, తాను ట్రేడింగ్లో పెట్టుబడులు పెడుతానంటూ ముందుకు రావడంతో ఆమె వద్ద నుంచి భారీగా వసూలు చేశారు. ఈ ముఠా నాయకుడు సుమిత్, అజిత్లను చత్తిస్ఘడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కాల్సెంటర్ నిర్వాహకుడు అరస్టైనా.., గ్యాంగ్ సభ్యులు మాత్రం తమ మోసాలను సాగించారు. హైదరాబాద్కు చెందిన మహిళ వద్ద, సుమిత్ అరెస్ట్ అయిన తరువాత కూడా డబ్బులు లాగేశారు. కాగా తాగా కస్టడీలో ఉన్న రాహుల్, మహేశ్దేవ్, వారి కుటుంబ సభ్యుల ఖాతాలలో రూ.48 లక్షలు హైదరాబాద్కు చెందిన బాధితురాలు డిపాజిట్ చేసింది. మరిన్ని డబ్బులు ఎవరి ఖాతాలో డిపాజిట్ చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే కేసులో మరోముగ్గురు నిందితులను నోయిడాలో ఇన్స్పెక్టర్ హరిభూషన్ బృందం అదుపులోకి తీసుకొని, హైదరాబాద్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.