నోటీసులు నిలిపివేసే అధికారం చైర్పర్సన్కు ఉంటుంది
రూ.3 కోట్ల 11లక్షల అంచనా బడ్జెట్కు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం
బడ్జెట్ సమావేశానికి హాజరైనఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
మక్తల్ టౌన్, మార్చి 31: అంచనా బడ్జెట్ పోవాలి , పక్కా బడ్జెట్ రూపొందించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పావని ఆధ్వర్యంలో మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే చిట్టెం హాజరయ్యారు. అధికారులు సమావేశంలో రూ.3కోట్ల 11 లక్షల బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. మక్తల్ మున్సిపాలిటీ ఏర్పడి నప్పటి నుంచి ప్రారంభపు నిల్వ రూ.16.22లక్షలు కాగా 2020 -2021 సాధారణ ఆదాయం మొత్తం రూ. కోటీ 90.97లక్షలు కాగా , ఖర్ఛు కోటీ 86లక్షలు. నిల్వ 4.92లక్షలుగా తేల్చారు. అదేవిధంగా 2021-2022 సాధారణ అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టగా రూ.3 కోట్ల 11లక్షలు కాగా, అంచనా మిగులు బడ్జెట్ రూ.9.62 లక్షలుగా బడ్జెట్ను మున్సిపల్ ఏఈ నాగశివ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రవేశ పెట్టాల్సింది అంచనా బడ్జెట్ కాదని, పక్కా బడ్జెట్ను ప్రవేశ పెట్టాలని మున్సిపాలిటీ చైర్పర్సన్ పావనిని, అధికారులను నిలదీశారు. మున్సిపాలిటీలో ఆదాయాన్ని పెంచుకోమని చెబుతూనే ఉన్నామని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.అదేవిధంగా టాక్స్ విషయంలో కమర్షియల్ నిర్మాణాలకు, మామూలు చిన్న ఇండ్లకు టాక్స్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్కు సూచించారు.
నోటీసులను ధిక్కరించవచ్చు..
మున్సిపాలిటీలోని దుకాణాల కు నోటీసులు అందినా, నోటీసులను ధిక్కరించే అధికారం మున్సిపల్ చైర్పర్సన్కు ఉందని తెలిపారు. నోటీసులను ధిక్కరించి మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చేవిధంగా వ్యవహరించాలని అధికారులకు చైర్పర్సన్కు సూచించారు. అదేవిధంగా తిర్మలాపూర్, చందాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాయని ఆ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలిపారు. అబివృద్ధి విషయంలో ఎవరు అడ్డు వచ్చినా చూస్తూ ఉండలేనని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. కమిషనర్కు అన్ని అధికారాలు ఉన్నాయని, మున్సిపాలిటీ అభివృద్ధికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కమిషనర్ రాజయ్యకు ఎమ్మెల్యే చిట్టెం సూచించారు. మక్తల్ను మున్సిపాలిటీని చేసింది అభివృద్ధి చేసుకోవడానికేనని, అభివృద్ధి కనబడాలని, చేసి చూపించాలని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అఖిల, కమిషనర్ రాజయ్య, ఏఈ నాగశివ, కౌన్సిలర్లు శ్వేత, జ్యోతి, ప్రసన్న, అర్చన, జగ్గలి రాములు, మొగిలప్ప, సత్యనారాయణ, కొండన్న, సుల్తానా, కోఆప్షన్ పద్మ, నాగలక్ష్మి, సబాసల్తానా తదితరులు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.