కౌన్సిలర్లు మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలి
ప్రతి వార్డుకూ పార్కు ఏర్పాటు చేయాలి
మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో కలెక్టర్ శర్మన్
కల్వకుర్తి, మార్చి 31: కల్వకుర్తిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ శర్మన్ తెలిపారు. బుధవారం కల్వకుర్తి మున్సిపాలిటీ మీటింగ్హాల్లో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం అధ్యక్షతన 2021-22 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ శర్మన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రూ.36కోట్ల 11లక్షల 80వేల ఆదాయం అంచనాతో రూపొందించిన బడ్జెట్ను మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. అనంతరం ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న బడ్జెట్ అంచనాలను ఆమోదించారు. మున్సిపల్ బడ్జెట్లో గతేడాది బడ్జెట్లో వ్యయాలు పోనూ మిగులు నిల్వ రూ.కోటి 51లక్షల 64వేలను 2021-22 సంవత్సరం ప్రారంభ బడ్జెట్ నిల్వగా చూపించారు. మొత్తం రూ.36కోట్ల 11లక్షల 80వేల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. బడ్జెట్ అంచనాల ప్రకారం కల్వకుర్తి మున్సిపాలిటీ జనరల్ ఫండ్కు వచ్చే ఆదాయంలో సింహభాగం ఆస్తి పన్నుదే. ఆస్తిపన్ను ద్వారా మున్సిసాలిటీకి రూ.4కోట్ల79లక్షల 83వేల ఆదాయం రానున్నది. మిగతా మొత్తం పన్నుయేతర ఆదాయ వనరుల ద్వారా సమకూరనున్నది.
వ్యయాలు, అంచనాలు ఇలా…
కల్వకుర్తి మున్సిపాలిటీకి 2021-22 సంవత్సరానికి గానూ సాధారణ నిధుల నుంచి రూ.5కోట్ల లక్షా 62వేలు వ్యయమవుతున్నట్లు అంచనా వేశారు. అలాగే ప్లాన్, నాన్ప్లాన్ నిధులు, గ్రాంట్ల ద్వారా వచ్చే ఆదాయంలో రూ.26కోట్ల 30లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. మొత్తం మున్సిపల్ బడ్జెట్లో వ్యయాలను రూ.9కోట్ల 41లక్షల 55వేలుగా చూపించారు. మిగిలిన కోటీ 42లక్షల 20వేలను 2021-22 సంవత్సరం మున్సిపల్ బడ్జెట్ ప్రారంభ నిల్వగా పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ మున్సిపల్ సాధారణ నిధుల ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం గ్రీన్ బడ్జెట్గా ప్రభుత్వ ఆదేశాల మేరకు చూపించామన్నారు. ప్రతి వార్డుకు పార్కును ఏర్పాటు చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కనూ బతికించుకునే బాధ్యతను కౌన్సిలర్లు తీసుకోవాలని సూచించారు. పట్టణంలో కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ సత్యం మాట్లాడుతూ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించిన బడ్జెట్ అంచనాలను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. సమిష్టి కృషితోనే పట్టణం అభివృద్ధి పథంలో ముందుందని చెప్పారు. అనంతరం కలెక్టర్ నర్సరీలను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ షాహెద్, ఆర్డీవో రాజేశ్కుమార్, కౌన్సిలర్లు సూర్యప్రకాశ్, సౌజన్య, మంజుల, శ్రీశైలం, లక్ష్మి, శ్రీనివాసులు, సైదులుగౌడ్, చైతన్య, చందన, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ పాల్గొన్నారు.