కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలి
కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్, మార్చి 31 : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులు, సిబ్బందితో సమీక్షించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమున్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలన్నారు. రైస్ మిల్లర్లు కూడా పూర్తి సహకారం అందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా తేమ కొలిచే యంత్రాలు, టార్ఫాలిన్లు, తూకం యంత్రాలు తదితర సామగ్రిని సమకూర్చాలని సూచించారు. గతేడాది మాదిరిగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్డీవో వెంకట్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుచరిత, జిల్లా సహకార అధికారి సుధాకర్, మెప్మా పీడీ శంకరాచారి తదితరులు ఉన్నారు.
3న కవి సమ్మేళనం..
స్వాతంత్య్ర భారత్ అమృతోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 3న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్ ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొనే కవులు స్వాతంత్య్ర స్ఫూర్తి అనే అంశంపై కవితలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. కవి సమ్మేళనం నిర్వహణకు జిల్లా పౌరసంబంధాల అధికారి, విద్యాశాఖ అధికారి, జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల అధికారులతోకూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కవులు తమ కవితను డీటీపీ చేయించి సమర్పించాలని కలెక్టర్ కోరారు.