మాస్కు తప్పని సరిగా ధరించాలి
ఖానాపూర్ ఎస్ఐ రాము
ఖానాపూర్ టౌన్, మార్చి 30: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ కొవిడ్-19 నిబంధనలు పాటించాలని మండల ప్రజలకు ఎస్ఐ రాము సూచించారు. ఖానాపూర్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో మంగళవారం అవగాహన కల్పించారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నదని జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పీహెచ్సీల్లో ప్రజలు, ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా వేస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్పై అపోహలు వీడాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, వాహనాల డ్రైవర్లు, పోలీసులు తదితరులున్నారు.
కరోనా నియంత్రణకు సహకరించాలి
లక్ష్మణచాంద, మార్చి 30 : కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐ యూనుస్ అహ్మద్ అలీ తెలిపారు. ప్రస్తుతం కరోనా మళ్లీ వేగంగా వ్యాపిస్తున్నదని పేర్కొన్నారు. బస్సులు, రైళ్లు, కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. కరోనా నియంత్రణ కోసం జీవో నం. 59, 60ని ప్రభుత్వం జారీ చేసిందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై 188 ఐపీసీ, 51 నుంచి 60 సెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ల కింద కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.