కృష్ణకాలనీ/గోవిందరావుపేట/వెంకటాపూర్, మార్చి 30: మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎస్సై ఉదయ్ కిరణ్ అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న 8మందికి జరిమానా విధించారు. అనంతరం మాస్కులు పంపిణీ చేశారు. ఎస్సై వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. గోవిందరావుపేట మండలంలో కరోనా నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పస్రా ఎస్సై రవీందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తప్పని సరిగా మాస్కు ధరించాలని, మాస్కు ధరించకుండా జాతీయ రహదారిపై కనిపిస్తే ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించనున్నట్లు తెలిపారు. వ్యాపార సంస్థల వద్ద ప్రజలు భౌతికదూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే చర్యలు తప్పవని వెంకటాపూర్ ఎస్సై రమేశ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఏప్రిల్ 30 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.