బాన్సువాడ , మార్చి 29 : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిందని బాన్సువాడ డీఎస్పీ జయపాల్రెడ్డి తెలిపారు. ఈ ఆంక్షలు మంగళవారం నుంచి ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటాయని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో పట్టణ ఎస్హెచ్వో రామకృష్ణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కొవిడ్ కట్టడిలో భాగంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రతి ఒక్కరికీ మాస్కును తప్పనిసరి చేసిందని తెలిపారు. వ్యాపార, వాణిజ్య జన సముదాయాల్లో తిరిగినా, బస్సులో ప్రయాణం చేసినా, అంగడి తదితర ప్రదేశాల్లో పనులపై బయటికి వచ్చినా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. రంజాన్, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి తదితర పండుగలు, ఉత్సవాలతోపాటు ర్యాలీలపై ఆంక్షలు విధించినట్లు వివరించారు. ఆంక్షలు ఉల్లఘించిన వారు ఐపీసీ 188 ప్రకారం శిక్షార్హులు అని తెలిపారు. ప్రతిరోజూ పోలీసుల తనిఖీలు ఉంటాయని, ప్రజలు సహకరించాలని కోరారు.
పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి
వేసవి కాలం సమీపించడంతో దొంగతనాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇతర గ్రామాలకు వెళ్లే వారు తమ పక్కింటి వారికి ఫోన్ నంబర్ ఇవ్వాలన్నారు. దీంతోపాటు స్థానిక పోలీసుస్టేషన్లలో సమాచారం ఇవ్వాలని సూచించారు. దీంతో సదరు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేస్తామని చెప్పారు.
ఇవీ కూడా చదవండి..
మీడియా, వినోద రంగం కోలుకున్నట్టే
బాతుపిల్లకు సింహం సాయం.. వైరల్ వీడియో