నగరంలో కరోనా సెకండ్వేవ్ మొదలవడంతో గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఒక పక్క కరోనా టీకా కేంద్రాలను కొనసాగిస్తూనే మరోపక్క కరోనా పరీక్షలనూ నిర్వహిస్తోంది. గతేడాది కేవలం కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సపైనే దృష్టి సారించిన వైద్య, ఆరోగ్యశాఖ ప్రస్తుతం టీకాతోపాటు కేసుల నిర్ధారణ, చికిత్స అందిస్తున్నది. గ్రేటర్ వ్యాప్తంగా ప్రతిరోజు 10వేల మందికి పైగా టీకా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యాక్సినేషన్లో భాగంగా మొదటి డోస్, రెండో డోస్ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా కరోనా పరీక్షల సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు.
250 పరీక్షా కేంద్రాలు..
నగరంలోని ప్రతి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలలు, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, నిమ్స్, బల్కంపేటలోని ప్రకృతి చికిత్సాలయం తదితర దవాఖానాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క హైదరాబాద్ నగరంలో 200, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 50 కేంద్రాల్లో పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర దవాఖానాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు…
అనుమానితులందరికీ కరోనా పరీక్షలు చేయడంతోపాటు బాధితులకు తగిన చికిత్స, సలహాలు, సూచనలు అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో కిట్ల కొరత రాకుండా, ఫలితాల వెల్లడి, రోగులను చికిత్స కోసం దవాఖానలకు తరలింపు తదితర అంశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే విషయాన్ని ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కరిస్తాయని అధికారులు తెలిపారు. నగరంలోని 12 క్లస్టర్లలో ప్రతి క్లస్టర్కు ఒక పర్యవేక్షణా బృందం పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.