రాజస్థాన్ : సరదాగా దాగుడు మూతలు ఆడుతూ ఇసుక సొరంగం కింద పదేళ్లలోపు ముగ్గురు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. రాజస్థాన్లోని ఝుంఝున్ జిల్లా ఉదయ్పూర్వతి పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్పుర గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ఒకేకుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇసుక సొరంగంలో దాగుడుమూతలు ఆడేందుకు వెళ్లారు.
పిల్లలు ఆడుకుంటుండగా ఉన్నట్లుండి సొరంగం కుప్పకూలడంతో ఇసుక కింద కూరుకుపోయారు. స్థానికులు అతికష్టం మీద వీరిలో ఒకరిని రక్షించగా.. మిగిలిన ముగ్గురు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ మనీశ్ త్రిపాఠి తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఇసుక సొరంగం 30 మీటర్ల )పొడవు ఉందని ఆయన పేర్కొన్నారు. మృతిచెందిన నిషాన్ (10), ప్రిన్స్ (7), కృష్ణా (7) అన్నదమ్ములని ఎస్పీ వెల్లడించారు. ప్రాణాలతో బయటపడిన ఎనిమిదేళ్ల చిన్నారిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నాయని చెప్పారు.