న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 4.36 కోట్ల డోసులు వేశామని, ఒకే రోజు 16 లక్షలకుపైగా టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం రాత్రి వరకు 4,36,75,564 వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వగా.. వీరిలో 77,63,276 మంది ఆరోగ్య కార్యకర్తలు మొదటి డోస్, 48,51,260 మంది రెండో డోస్ తీసుకున్నారని చెప్పింది. మరో 80,49,848 మంది ఫ్రంట్లైన్ కార్మికులకు ఫస్ట్ డోస్, 25,41,265 మందికి సెకండ్ డోస్ వేశామని పేర్కొంది. అలాగే 60 ఏళ్లు పైబడిన 1,69,58,841 మందికి, 45 ఏళ్లు పైబడిన 35,11,074 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేసినట్లు తెలిపింది. వ్యాక్సినేషన్ 64వ రోజు రాత్రి 7 గంటల వరకు మొత్తం 16,12,172 మోతాదులను ఇచ్చినట్లు వివరించింది. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కొవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది. సామాజిక దూరం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, ఫేస్మాస్క్లు ధరించడం తదితర నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.