సీఎం కేసీఆర్కు రైతుల బాధలు తెలుసు
ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్
జమ్మికుంట/జమ్మికుంట రూరల్, మార్చి 20: అన్నదాతల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రైతు వేదికలను ఏర్పాటు చేశామని, ‘వేదికలు’ రైతులకు పరిష్కార కేంద్రాలుగా మారాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అభిలషించారు. శనివారం జమ్మికుంటలో సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంతో పాటు మండలవ్యాప్తంగా మంత్రి ఈటల పుట్టినరోజు వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించగా, ఆయాచోట్ల అమాత్యుడు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని చిల్డ్రన్స్ పార్కు, మున్సిపల్ కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకర్లు, ట్రాక్టర్లు, స్వీపింగ్ మిషన్, హైమాస్ట్ లైట్లు, జమ్మికుంట-హుజూరాబాద్ ప్రధాన రహదారిలోని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, తనుగుల క్లస్టర్, మడిపల్లిలోని రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. ప్రతి రైతు అనుభవం ఉన్న శాస్త్రవేత్త అని, మీ అందరి కృషితో రైతు వేదికలు రీసెర్చ్ కేంద్రాలు కావాలని ఆకాంక్షించారు. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్కు రైతుల బాధలన్నీ తెలుసునన్నారు. బడ్జెట్లో ప్రభుత్వం చెక్డ్యాంల కోసం రూ.5వేల కోట్లను కేటాయించిందని, హుజూరాబాద్ నియోజకవర్గంలో 18చెక్డ్యాంలు నిర్మించుకుని, సాగు, తాగు నీటికి ఇబ్బందుల్లేకుండా చేసుకున్నామని చెప్పారు. రూ.వెయ్యి కోట్లతో ఎస్సారెస్పీని ఆధునీకరించుకున్నామని, నిత్యం నీళ్లు పారించుకుంటున్నామని తెలిపారు. కాళేశ్వరం నీళ్లతో జిల్లా సస్యశ్యామలంగా మారిందని చెప్పారు. సీడ్ వడ్లతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైతు వేదికలు ఆ ఇబ్బందులను తొలగిస్తాయని తెలిపారు. సీడ్ యజమానులతో అగ్రిమెంట్ అయ్యేలా రైతు వేదికలు చేస్తాయని చెప్పారు. రైతులు బిచ్చగాళ్లు కాదని, కేంద్రం చట్టంలో అనేక మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. రైతుకు లాభం జరిగితేనే అందరూ బాగుపడుతారని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో భర్తలు మృతి చెందిన ప్రతి మహిళకు ఉపాధి మార్గాన్ని చూపుతానని, నా పుట్టిన రోజున హామీ ఇస్తున్నానని చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు అందిస్తామని తెలిపారు. రైతు సమన్వయ సమితి సభ్యులంతా కలిసి మెలిసి పనిచేయాలని, రైతుల అభ్యున్నతికి తోడ్పడాలని కోరారు. ఇక్కడ జడ్పీ అధ్యక్షురాలు విజయ, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్, మన్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, కమిషనర్ అనిసూర్ రశీద్, ఎంపీపీ మమత, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పాలకవర్గం, రైతులు పాల్గొన్నారు.