లాక్డౌన్ తర్వాత సినిమా రంగం పరిస్థితి ఎలా ఉంటుందని అందరు ఆందోళన చెందుతున్న సమయంలో ఉప్పెన చిత్రం అందించిన కాన్ఫిడెన్స్ అంతా ఇంతా కాదు. సున్నితమైన ప్రేమ కథాంశంగా రూపొందిన ఉప్పెన చిత్రం తొలి రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళ రాబడుతూ అందరు అవాక్కయ్యేలా చేసింది. నాలుగైదు రోజులలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ను క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
డెబ్యూ దర్శకుడు బుచ్చిబాబు, డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్, డెబ్యూ హీరోయిన్ కృతి శెట్టి కలిసి చేసిన మ్యాజిక్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సినిమా సక్సెస్లో భాగమైంది. తాజాగా ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్ళు రాబట్టిందని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ద్వారా పేర్కొన్నారు. ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు అని కామెంట్ పెట్టారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.