యాదాద్రి భువనగిరి, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలోని 104 వార్డుల్లో జూలై 1 నుంచి 10వ తేదీ వరకు పది రోజులపాటు ‘ప్రగతి’ పనులను నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పది రోజుల ప్రణాళికను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అమలు చేశారు. తొలిరోజు భువనగిరి మున్సిపాలిటీ రాయగిరిలోని దళితవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్శాఖ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు సైతం రోజుకోచోట ‘ప్రగతి’ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఇంటింటికీ మొక్కల పంపిణీతోపాటు తాగునీటి వనరుల క్లోరినేషన్ వంటి పనులను పకడ్బందీగా నిర్వహించడంతో అన్ని చోట్లా ప్రగతి పనులు సత్ఫలితాలను ఇచ్చాయి.
పది రోజులపాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన పట్టణ ప్రగతితో నేడు పరిశుభ్రతతో రోడ్లు, వీధులు అద్దాల్లా మెరుస్తున్నాయి. పాత గోడలు, పాడుబడిన బావులు కనుమరుగైపోయాయి. హరితహారం మొక్కలతో అన్ని వార్డులు పచ్చలహారంగా మారిపోయాయి. వేలాడే విద్యుత్ తీగలు సరిచేయబడి.. ఎల్ఈడీ లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి.
పారిశుధ్య పనులతో భాగంగా.. 4,765 టన్నుల చెత్త తొలగించారు. 12కి.మీ.మేర రోడ్ల వెంట కంప చెట్లతో పాటు ఇతర ముళ్ల పొదలను తొలగించి పరిశుభ్రపర్చారు. 19కి.మీ.ల మేర మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. శిథిలావస్థలో ఉన్న 30 ఇండ్లను కూల్చివేసేందుకు చర్యలు తీసుకున్నారు. 73 ప్రాంతాల్లో దోమల నివారణ కోసం ఫాగింగ్ చేపట్టారు. 20 రక్షిత మంచి నీటి సరఫరా ట్యాంకులను శుభ్రపర్చారు. 20 కమ్యూనిటీ హాల్స్, పార్కులు, ఆరు పబ్లిక్ టాయిలెట్స్, 19 వైకుంఠధామాలను శుభ్రపర్చారు. పని చేయని 3 బోర్లను గుర్తించి పూడ్చివేశారు. ఇంటింటికీ 6 మొక్కల పంపిణీలో భాగంగా 67,928 మొక్కలను పంపిణీ చేయడంతోపాటు 7,322 మొక్కలను నాటి ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం చర్యలు తీసుకున్నారు. 62 తుప్పుపట్టిన, శిథిలమైన విద్యుత్ స్తంభాలను తొలగించడంతోపాటు 18 పోల్స్ను సవరించారు. 2,810 మీటర్ల మేర వేలాడే విద్యుత్ వైర్లను సరిచేశారు. 34 దళిత బస్తీల్లో పర్యటించి ప్రగతి పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అన్ని మున్సిపాలిటీల్లో నూటికి నూరు శాతం పట్టణ ప్రగతి కార్యక్రమాలను కవర్ చేసినట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు.