కేప్టౌన్: మహాత్మా గాంధీ మునిమనవరాలు ఆశిశ్ లతా రామ్గోబింద్కు మోసం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. మోసం, ఫోర్జరీ కేసులో ఈ శిక్ష పడటం గమనార్హం. సౌతాఫ్రికాలో ఉంటున్న ఆమె 60 లక్షల రాండ్ (సుమారు రూ.3.22 కోట్లు)ల మేర మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆమె దోషిగా తేలడంతో డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వ్యాపారవేత్త ఎస్ఆర్ మహరాజ్ను ఆశిశ్ లతా రామ్గోబింద్ మోసం చేసినట్లు తేలింది. ఇండియా నుంచి అసలు లేని కన్సైన్మెంట్కు దిగుమతి, కస్టమ్స్ డ్యూటీలు మాఫీ చేయిస్తానని చెప్పి 62 లక్షల రాండ్లను అందుకున్న తర్వాత ఆయనను మోసం చేసినట్లు పీటీఐ రిపోర్ట్ వెల్లడించింది. లాభాల్లో ఎస్ఆర్ మహరాజ్కు వాటా ఇస్తామని ఆమె హామీ ఇచ్చింది.
ప్రముఖ హక్కుల కార్యకర్తలైన ఈలా గాంధీ, మేవా రామ్గోబింద్ల కుమార్తె ఈ లతా రామ్గోబింద్. ఈ కేసులో దోషిగా తేలడంపై, విధించిన శిక్షపై అప్పీలు చేసే అవకాశాన్ని కూడా డర్బన్ కోర్టు లతా రామ్గోబింద్కు కల్పించలేదు. లతా ఇన్వాయిస్లు, పత్రాలను ఫోర్జరీ చేశారని, ఇండియా నుంచి మూడు లినెన్ కంటైన్లు వస్తున్నట్లుగా ఇన్వెస్టర్లకు చెప్పారని నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ (ఎన్పీఏ)కు చెందిన బ్రిగేడియర్ హంగ్వానీ ములౌజీ ఆరోపించారు. ఈ కేసులో 50 వేల రాండ్ల పూచీకత్తుతో లతా రామ్గోబింద్కు బెయిల్ మంజూరు చేశారు.
లతా రామ్గోబింద్కు ఎస్ఆర్ మహరాజ్తో ఆరేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఈ ఎస్ఆర్ మహరాజ్ న్యూ ఆఫ్రికా అలయెన్స్ ఫుట్వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్. ఈయన కంపెనీ బట్టలు, పాదరక్షలు తయారుచేయడంతోపాటు ఇతర కంపెనీలకు ఫైనాన్స్ కూడా చేస్తుంది. ఇండియా నుంచి తాను సరుకులు తెప్పిస్తానని చెప్పి మహరాజ్కు ఫోర్జరీ చేసిన పత్రాలను పంపించి 62 లక్షల రాండ్లను లతా రామ్గోబింద్ తీసుకుంది. అయితే ఆ తర్వాత ఆ పత్రాల గురించి తెలుసుకున్న మహరాజ్.. ఆమెపై క్రిమినల్ కేసులు పెట్టారు.