జర్నలిస్టు కుటుంబాల నుంచిదరఖాస్తుల ఆహ్వానం
తుది గడువు ఈ నెల 25: అల్లం నారాయణ వెల్లడి
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి అందజేసే ఈ సాయం కోసం ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తుతోపాటు అక్రెడిటేషన్, ఐడీ, ఆధార్కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం (రూ.2 లక్షలలోపు ఉండాలి), ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్పుస్తకం, మూడు ఫొటోలు, జిల్లా వైద్యాధికారి జారీచేసిన కొవిడ్-19 మరణ ధ్రువీకరణపత్రం జతచేయాలని సూచించా రు. ఈ దరఖాస్తులను జిల్లా పౌరసంబంధాల అధికారుల ద్వారా ధ్రువీకరించి హైదరాబాద్లోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయానికి స్వయంగా లేదా పోస్ట్ ద్వారా అందజేయాలని తెలిపారు. ఇతర వివరాలకు 7702526489 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమనిధి నుంచి గతంలో లబ్ధిపొందినవారు, ఇప్పటికే మీడి యా అకాడమీకి దరఖాస్తులు పంపినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టంచేశారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు గతంలో మాదిరిగానే నెలకు రూ.3 వేల చొప్పున 5 ఏండ్లపాటు పెన్షన్ లభిస్తుందన్నారు. ఆయా కుటుంబాల్లో పదో తరగతిలోపు చదువుతున్న పిల్లలకు (గరిష్ఠంగా ఇద్దరికి) రూ.1,000 చొప్పున ఉపకార వేతనం అందిస్తామని అల్లం నారాయణ తెలిపారు.