కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాణీబంధ్లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. నందిగ్రామ్ ఘటనకు సంబంధించి మమతకు పంచ్ ఇచ్చారు. నా హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా నాకు ఆలస్యమైంది. కానీ దీనిని కుట్ర అని నేను అనను అని అమిత్ షా అన్నారు. నందిగ్రామ్ ఘటన మమతపై జరిగిన దాడి కాదు అని ఎన్నికల సంఘం కూడా తేల్చిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. మీ హయాంలో 130 మంది చనిపోయారు. వాళ్ల బాధ ఎంతో మీకు తెలుసా? మీ కాలికి గాయం తగిలిన తర్వాత మీకు నొప్పి తెలుస్తోంది అని షా విమర్శించారు. నందిగ్రామ్లో నామినేషన్ వేసిన తర్వాత మమతా గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఎవరో నలుగురైదుగురు వ్యక్తులు తనను కావాలనే తోసేయడం వల్ల గాయపడ్డానని, ఇది కుట్ర అని మమత ఆరోపించారు. అయితే ఈ ఘటనపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం మాత్రం మమతపై దాడి జరగలేదని తేల్చింది.