మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన వర్షాల వల్ల నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్నది. దీంతో ఉదయం 9 గంటలకు 2 లక్షల 60 వేల క్యూసెక్కుల నీరు జూరాల జలాశయానికి వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 31 గేట్లు ఎత్తి 2,28,224 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 20,657 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్ సాగర్, భీమా, జూరాల ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది.
కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి నుంచి నారాయణపూర్కు భారీ వరద వస్తున్నది. దీంతో నారాయణపూర్ జలాశయం నుంచి శనివారం ఉదయం 11 గంటలకు 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు జూరాల ప్రాజెక్టుకు మరింత వరద వచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
శ్రీశైలం ప్రాజెక్టు 215 టీఎంసిల పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 87 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో మరో వారం రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు, జూరాల నుంచి శ్రీశైలానికి భారీ వరద కొనసాగుతున్నందున నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లా యంత్రాంగం ప్రజలను హెచ్చరించింది.