బెల్లంపల్లి టౌన్, ఏప్రిల్ 29 : ఏరియా దవాఖానలోని ఐసోలేషన్ కేంద్రంలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. సింగరేణి డైరెక్టర్ బలారాం, జీఎం సంజీవరెడ్డితో కలిసి గురువారం ఐసోలేషన్ సెంటర్ను సందర్శించారు. ఇప్పటికే 120 పడకలు, 40 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, అవసరమున్న కరో నా బాధితుడికి ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం అందిస్తున్నారన్నారు. పాజిటివ్ కేసులకు అనుగుణంగా 200 పడకలు పెంచాలన్నారు. అలాగే సిబ్బందిని యుద్ధప్రాతిపదికన తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డైరెక్టర్ అవసరం మేరకు వైద్య సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సరిపడా సిబ్బందిని వెంటనే తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏసీపీ ఎం.ఏ.రహమాన్, వైద్యులు అనిల్, నాయకులు గడ్డం భీమాగౌడ్, అనుముల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో డైరెక్టర్ సమీక్ష
శ్రీరాంపూర్, ఏప్రిల్ 29 : స్థానిక జీఎం ఆఫీస్లో సింగరేణి డైరెక్టర్ పీపీ, ఫైనాన్స్ ఎన్ బలారాం ఏరియా జీఎం ఎం సురేశ్, అధికారులతో గురువా రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏరియాలోని గనులు, ఓసీపీలు, కార్మికుల కాలనీల్లో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఉత్పత్తి, ఉత్పాదకతకు కృషి చేయాలని సూచించారు. కార్మికులకు వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీవైజీఎం గోవిందరావు, చిరంజీవులు, పీఎం రవిప్రసాద్ పాల్గొన్నారు.