హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సెప్టెంబర్ 2న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం వసంత్ విహార్లో కేటాయించిన 1200 చదరపు మీటర్ల స్థలంలో పార్టీ ఆఫీసు శాశ్వత భవనం నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రోడ్లు భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పలువురు ఇంజినీరింగ్ నిపుణులను ఢిల్లీకి తీసుకెళ్లి భవన నిర్మాణ ప్రణాళికను సిద్ధంచేశారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ రావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.