మెండోరా, మార్చి 25: నిజామాబాద్ జిల్లా ఎస్సారెస్పీ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం 48 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 88.27 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరగడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి కేంద్రంలో 60 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, రికార్డు స్థాయిలో 88.27 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. తొమ్మిదేండ్ల క్రితం (2011-12) 88.07 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా, ప్రస్తుతం ఆ రికార్డును బద్దలు కొడుతూ విద్యుదుత్పత్తి కావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు టర్బయిన్లతో విద్యుదుత్పత్తి
ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో రావడంతో జలకళను సంతరించుకున్నది. ప్రాజెక్ట్ కాకతీయ కాలువకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నాలుగు టర్బయిన్లతో విద్యుదుత్పత్తిని చేస్తున్నారు. దీంతో జిల్లాలోని అనేక ప్రాంతాలకు సరఫరా చేస్తూ గ్రామాల్లో విద్యుత్ వెలుగులు నింపుతున్నది. ముఖ్యంగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో ఆయకట్టుకు ఢోకాలేకుండా పోయింది. ఎగువ మహారాష్ట్ర, గోదావరి తీరప్రాంతాల నుంచి ఇన్ఫ్లో తక్కువైనా 50 టీఎంసీలను అలవోకగా కాళేశ్వరం నుంచి తరలించవచ్చు. దీంతో రెండు సీజన్లలో విద్యుదుత్పత్తి ని చేయనున్నారు. కాకతీయ కాలువకు వానకాలం, యాసంగి పంటలకు, ఎస్కేప్ గేట్లతో గోదావరిలోకి నీటివిడుదల కొనసాగించడంతో విద్యుదుత్పత్తి జరిగింది.
తొమ్మిది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రాన్ని 1984 డిసెంబరు నెలలో ప్రారంభించారు. నాలుగు టర్బయిన్లు లక్ష్యంగా, ఒక్కో టర్బయిను తొమ్మిది మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా సాంకేతికంగా యంత్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టర్బయిను ద్వారా 1850 నుంచి 2200 క్యూసెక్కులు వరకు విడుదల చేసినపుడు తొమ్మిది మెగావాట్లు విద్యుదుత్పత్తి అయ్యేలా డిజైన్ చేశారు. నాలుగు టర్బయిన్ల నుంచి 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా కేంద్రాన్ని నిర్మించారు. ఈ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని కాకతీయ కాలువకు అనుసంధానంగా నిర్మించారు.