మహబూబ్నగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్వర్క్: కృష్ణాబేసిన్లో వరద స్థిరంగా కొనసాగతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి మొదలు శ్రీశైలం వరకు జలాశయాలకు భారీ ఇన్ఫ్లో నమోదవుతున్నది. మంగళవారం జూరాలతోపాటు తుంగభద్ర డ్యాం నుంచి దాదాపు 3.98 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ వేగం గా పెరుగుతున్నది. శ్రీశైలం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 172.66 టీఎంసీలకు చేరుకున్నది. బుధవారం సాయంత్రం వరకు గేట్లు ఎత్తే అవకాశమున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. ఇక గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శ్రీరాంసాగర్కు 3,585 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఎల్లంపల్లికి 18 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది.