కరోనా నేపథ్యంలో సర్కారు ఆంక్షలు
దండేపల్లి మండలం ఊట్ల సమీపంలో చెక్పోస్టు ఏర్పాటు
జంతువులకూ వైరస్ సోకే అవకాశం
నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా, చర్యలు
కొవిడ్ తగ్గే వరకు నిబంధనలు అమలు
దండేపల్లి డిప్యూటీ రేంజర్ విజయపద్మావతి
దండేపల్లి, మే 2 : కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతున్న నేపథ్యంలో పార్కులు, ఉద్యానవనాలు, పులుల అభయారణ్యాలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో స్థానిక అటవీశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు దండేపల్లి మండలం ఊట్ల సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు.ప్రతి ఆదివారం, గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు పెద్దయ్య గుట్టకు వెళ్లే మార్గం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా తీవ్రత తగ్గే వరకు నిబంధనలు అమలులో ఉంటాయని ఫారెస్ట్ అధికారులు పేర్కొంటున్నారు.
ఆంక్షలు ఇవే..
కరోనా వైరస్ నేపథ్యంలో అడవుల రక్షణతో పాటు వన్యప్రాణులకు ఎలాంటి హాని కలుగకుండా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులోకి వెళ్లేందుకు అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధించారు. టైగర్ జోన్ పరిధిలోకి వచ్చే అడవుల్లో పిక్నిక్ పార్టీలు, మనుషులు వెళ్లేందుకు అనుమతులు నిరాకరించారు. ఈ మేరకు ఊట్ల సమీపంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణులకు హాని చేయడం, మద్యం తాగడం, ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు తీసుకెళ్లడం, చెట్ల కొమ్మలు నరకడం లాంటివి ఇక్కడ గతంలో నిషేధం ఉండేది.
తనిఖీలు ముమ్మరం..
దండేపల్లి మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ప్రసిద్ధి గాంచిన పెద్దయ్య దేవుని ఆలయం ఉంది. ఇక్కడికి ప్రతి ఆది, గురువారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. దర్శనానికి వచ్చే భక్తులు ఆలయం వద్ద మొక్కులు చెల్లించుకొని, పరిసర ప్రాంతాలలో వంటలు చేసుకొని విందులు ఆరగిస్తుంటారు.
నిబంధనలు పాటించాలి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఊట్ల సమీపంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేశాం. కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. రాకపోకలను నిషేధిస్తూ చెక్పోస్ట్ ఏర్పాటు చేశాం. మనుషుల ద్వారా అటవీ జంతువులకు కరోనా సోకకుండా భక్తులను అటవీ ప్రాంతంలోకి నిషేధించాం.నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాతో పాటు చర్యలు తీసుకుంటాం.
విజయపద్మావతి, డిప్యూటీ రేంజర్-దండేపల్లి