హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఉదార స్వభావం చాటుకున్నది. మహమ్మారి విజృంభణతో ఉపాధి కోల్పోయి అర్ధాకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు జూన్ నెలకు 15 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు.
జూన్ నెల రేషన్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 53లక్షల 56వేల కార్డులకు అందించే పదిహేను కిలోలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 33లక్షల 86వేల కార్డుదారులకు ఎలాంటి పరిమితి లేకుండా పదిహేను కిలోలు ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు 35 కేజీలకు అదనంగా మరో పది కిలోల్ని, అన్నపూర్ణ కార్డుదారులకు పదికిలోలకు అదనంగా మరో పదికిలోల్ని అందించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 2 కోట్ల 79లక్షల 24వేల 300 మందికి లబ్ది చేకూరనుంది.