హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వానలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం 6 గంటల వరకు అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్లో 13 సెంటీమీటర్లు నమోదైంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 12.4 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రాలో 11.8, నిజామాబాద్ జిల్లా వాయిల్పూర్లో 11.5, మేడ్చల్ జిల్లా మౌలాలిలో 11.4, నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 11.3, ఏర్గట్లలో 11.1, మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో 10.9, ఉప్పల్ రాజీవ్నగర్లో 10.8, ఖమ్మం జిల్లా వేంసూరులో 10.8, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కల్దుర్కిలో 10.5, జగిత్యాల జిల్లా సిరికొండలో 10.5, నిర్మల్ జిల్లా కడెం పెద్దూర్లో 10.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. కాగా, ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆదిలాబాద్లోని పొచ్చెర జలపాతం పొంగిపొర్లుతున్నది.
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో మరో 4 రోజులు భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. ఉత్తర ఒడిశా నుంచి ఇంటీరియర్ ఒడిశా వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద బుధవారం ఏర్పడిన ఉపరితల ద్రోణితోపాటు మంగళవారం ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీన పడటంతో రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో వర్షం కురిసింది.