హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ ఒడ్డున నెలకొల్పనున్న దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని 15 నెలల్లో పూర్తిచేస్తామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అంబేద్కర్కు దేశంలో మరెవ్వరూ ఇవ్వలేనంత గౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నారని, ప్రత్యేక శ్రద్ధతో విగ్రహ డిజైన్ రూపొందించారని పేర్కొన్నారు. గురువారం హుస్సేన్సాగర్ ఒడ్డున అంబేద్కర్ విగ్రహ నిర్మాణపనులను పరిశీలించి, పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. పార్లమెంట్ను పోలిన 50 అడుగుల పీఠం, దానిపై 125 అడుగల ఎత్తయిన కాంస్య విగ్రహం ఉండేలా డిజైన్ చేసినట్టు వివరించారు. ఈ నిర్మాణం మొత్తం 175 అడుగుల ఎత్తులో ఉంటుందని చెప్పారు.
11.4 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రాంగణంలో మ్యూజియం, ఫొటో ఆర్ట్ గ్యాలరీ, ఎగ్జిబిషన్, గ్రంథాలయం, ధ్యానమందిరం, సమావేశ మందిరం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అంబేద్కర్ జీవిత విశేషాలతో లేజర్షో, క్యాంటీన్, సువిశాలమైన పారింగ్ ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. దీనిని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ విగ్రహం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అన్నివర్గాల ఆత్మగౌరవ కేంద్రంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
స్కాలర్షిప్ నిబంధనలు సడలించాలి
విదేశాల్లో ఉన్నత చదువుల నిమిత్తం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్ల మంజూరులో నిబంధనలు సడలించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్లో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల విదేశీ చదువులకు ప్రభుత్వం రూ.20 లక్షల సహాయం అందజేస్తున్నదని, కఠిన నిబంధనల కారణంగా లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉన్నదని చెప్పారు. మానవతా దృక్పథంతో వీటిని సడలించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.