డోనర్ రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్తో ప్రారంభం
తీరనున్న పిల్లల దీర్ఘకాల అనారోగ్య సమస్యలు
త్వరలో చిన్నారులకు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు
సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ఇకనుంచి అవయవాలు విఫలమైన చిన్నారులకు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రముఖ చిన్నపిల్లల దవాఖాన నీలోఫర్ సిద్ధమవుతున్నది. రోజురోజుకూ పిల్లల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సల అవసరం పెరుగుతున్న దృష్ట్యా నీలోఫర్లో త్వరలోనే పీడియాట్రిక్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జీవన్దాన్ సెంటర్ను ప్రారంభించినట్లు జీవన్దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత తెలిపారు. ప్రధానంగా పిల్లల్లో మూత్రపిండాల సమస్యలు అధికంగా ఉంటున్నట్లు గుర్తించామని, వీటితోపాటు గుండె, కాలేయం, కార్నియా వంటి ప్రధాన అవయవాలు అవసరమున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానల్లో మాత్రమే జీవన్దాన్ కేంద్రాలున్నాయని, అవయవదానం చేయాలనుకునేవారు, అవయవాలు అవసరమైన రోగులు ఈ మూడు దవాఖానల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశముండేదని, అయితే ఇది కేవలం పెద్దలకు మాత్రమేనని, నిమ్స్లో పదేళ్లు పైబడిన పిల్లలకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేశారని డాక్టర్ స్వర్ణలత తెలిపారు. పదేళ్లలోపు, ఆపై వయస్సు గల పిల్లలకు కూడా నీలోఫర్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించాలని సంక్పలించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు మూడు రోజుల క్రితం జీవన్దాన్ కేంద్రాన్ని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, జీవన్దాన్ కోఆర్డినేటర్ స్వర్ణలత, ఉస్మానియా నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మనీషాసాహెతో కలిసి డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి ప్రారంభించారు. పిల్లలకు సంబంధించి ఆర్గాన్ డోనర్స్కు కౌన్సెలింగ్ ఇవ్వడం, డోనర్స్కు సంబంధించి రిజిస్ట్రేషన్ వంటి కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయి.
10కిలోల బరువున్న చిన్నారులకు మార్పిడి చేయొచ్చు
సాధారణంగా 10కిలోల బరువున్న శిశువుకు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు. ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కొంతమంది నవజాత శిశువుల్లో లివర్ సమస్యలు వస్తున్నాయి. వారికి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరముంటుంది. ఇవే కాకుండా గుండె, కార్నియా వంటి ఆర్గాన్స్ పీడియాట్రిక్స్కి అవసరముంటుంది.
-డాక్టర్ మనీషాసాహె, నెఫ్రాలజీ హెడ్, ఉస్మానియా దవాఖాన
అవయవ మార్పిడి చేసే ఉద్దేశంతోనే..
ప్రస్తుతం 10 ఏండ్లు పైబడిన వారికి కేవలం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. ఇవి కూడా చాలా తక్కువ. కిడ్నీతోపాటు కాలేయం, గుండె, కార్నియా తదితర ప్రధానావయవాల మార్పిడి అవసరం ఏర్పడుతున్నది. అందుకే నీలోఫర్లో జీవన్దాన్ సెంటర్ ప్రారంభించాం. త్వరలో శస్త్రచికిత్సలు ప్రారంభిస్తాం.