హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలలో మంచినీటి సమస్య పరిష్కారానికి తక్షణమే రూ.1200 కోట్ల అదనపు నిధులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంజూరుచేశారు. నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంనుంచి అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిపై పంచాయతీరాజ్, మున్సిపల్శాఖల అధికారులు క్యాబినెట్కు నివేదికలు సమర్పించారు. ఈ నివేదికలను పరిశీలించిన మంత్రిమండలి.. నెలరోజుల్లోగా వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించింది. అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం మూడో వైరును తప్పకుండా ఏర్పాటుచేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ల్యాండ్ పూలింగ్ వ్యవస్థ ద్వారా ప్రత్యేకంగా లే అవుట్లను అభివృద్ధిచేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన అవకాశాలను పరిశీలించి విధి విధానాలను రూపొందించాలని మున్సిపల్శాఖ అధికారులను ఆదేశించింది.