ఎన్నికల ముంగిట కీలక పరిణామం
నేను ఎమర్జెన్సీనే ఎదుర్కొన్నవాడిని
ఇలాంటి దాడులకు భయపడను: స్టాలిన్
వెల్లూర్, ఏప్రిల్ 2: మరో మూడు రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా కీలక పరిణామం చోటుచేసుకున్నది. ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ అల్లుడు శబరీశన్ నివాసంలో ఐటీ శాఖ గురువారం సోదాలు నిర్వహించింది. చెన్నైలోని నీలాంగరాయ్ ప్రాంతంలో ఉన్న శబరీశన్ నివాసంతోపాటు ఆయనకు సంబంధించిన మరో మూడు కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. స్టాలిన్ కుమార్తె సెంతమరై భర్త శబరీశన్. డీఎంకే ముఖ్యనేతల్లో ఆయన ఒకరు. పార్టీకి సంబంధించిన ఇతర నాయకుల నివాసాల్లోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. తన అల్లుడి ఇంట్లో తనిఖీలు చేపట్టడంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ‘నేను ఎంకే స్టాలిన్ను. ఈ స్టాలిన్ ఎమర్జెన్సీని, మీసా కేసులను కూడా ఎదుర్కొన్నాడు. ఐటీ దాడులకు భయపడేది లేదు. కాళ్లమీద పడి వేడుకునేందుకు మేం అన్నాడీఎంకే నాయకులం కాదు’ అని పేర్కొన్నారు. పెరంబలూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ‘మోదీకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇక్కడున్నది డీఎంకే. అది మరచిపోవద్దు. నేను కలైంజ్ఞర్ (దివంగత కరుణానిధి) కుమారుడిని. ఇలాంటి దాడులకు నేను భయపడను’ అని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ధ్వజమెత్తారు. మరోవైపు, ఎన్నికల ముందు పార్టీ నాయకుల ఇండ్లలో ఐటీశాఖ తనిఖీలు జరుపడంపై డీఎంకే గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే
స్టాలిన్ కుమార్తె, అల్లుడి నివాసంలో ఐటీ సోదాలు జరుపడంపై పలుపార్టీలు మండిపడ్డాయి. ఎన్నికల్లో ఓటమి ఎదురవుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకులపై ఐటీ దాడులు చేయించడం బీజేపీకి పరిపాటేనని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విమర్శించారు.
మదురైని మాఫియాడెన్గా మార్చారు: మోదీ
శాంతిపూర్వక జీవనానికి ఆలవాలమైన మదురై నగరాన్ని డీఎంకే నేతలు తమ కుటుంబ తగాదాలతో ‘మాఫియా డెన్’గా మారుస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. డీఎంకే అధినేత స్టాలిన్, ఆయన అన్న అళగిరి మధ్యనున్న విభేదాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ విమర్శలు చేశారు. సమగ్ర అభివృద్ధి, సంపన్న సమాజం కోసం కృషిచేసిన దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ విజన్ తమకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు.
మోదీ.. నేను మీ పార్టీ మెంబర్ను కాదు: మమత
దిన్హతా , ఏప్రిల్ 2: నందిగ్రామ్లో ఓడిపోతానన్న భయంతో బెంగాల్ సీఎం సీఎం మమతాబెనర్జీ మరోచోట పోటీకి సిద్ధమవుతున్నారన్న ప్రధాని మోదీ విమర్శలను తృణమూల్ అధినేత్రి తిప్పికొట్టారు. తాను బీజేపీ సభ్యురాలిని కాదని, తనను నియంత్రించేందుకు ప్రయత్నించవద్దని ప్రధానికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కూచ్బిహార్ జిల్లాలో శుక్రవారం మమత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘ముందు మీ హోంమంత్రిని నియంత్రించి ఆ తర్వాత మా గురించి ఆలోచించాలని ప్రధానికి చెప్పదల్చుకున్నాను. నేను నందిగ్రామ్లో గెలిచి తీరుతాను’ అని ఆమె పేర్కొన్నారు.
కమల్ హాసన్ ‘సూపర్ నోటా’: కార్తీ చిదంబరం
నటుడు కమల్ హాసన్ ఒక ‘సూపర్ నోటా’ అని తమిళనాడు కాంగ్రెస్ నేత, ఎంపీ కార్తీ చిదంబరం ఎద్దేవా చేశారు. బ్యాలెట్ పేపర్లో ‘నోటా’ ఆప్షన్ చివరన ఉన్నట్లుగా.. తమిళనాడు ఎన్నికల బరిలో ఉన్నవారిలో ప్రజల ఆఖరు ప్రాధాన్యం కమల్ అంటూ నోటాతో పోల్చారు. కమల్ పార్టీ ఎంఎన్ఎం ఒక్క సీటు కూడా గెలవదని, ఆ పార్టీ ఎక్కువ కాలం మనుగడలో ఉండదన్నారు.
ఇవి కూడా చదవండి..
450 మంది టూరిస్టులను రక్షించిన భారత జవాన్లు
థర్మల్ పవర్ ప్లాంట్లకు కొత్త నిబంధనలు
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. బాధితురాలు ఆత్మహత్య
అస్సాంలో బీజేపీ నేత కారులో ఈవీఎం
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
స్పీడ్ ఎక్కువ.. డేంజర్ తక్కువ!