తెలంగాణలో 47 క్తొత వంగడాలు రూపకల్పన
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): వ్యవసాయవర్సిటీ నుంచి ఆరు రకాల పంటల్లో 11 కొత్త వంగడాలను విడుదల చేసినట్టు వీసీ ప్రవీణ్రావు తెలిపారు. తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి ఇచ్చే ఈ వంగడాలతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. తెలంగాణ వచ్చాక వర్సిటీ నుంచి మొత్తం 47 రకాల కొత్త వంగడాలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. గురువారం హోంసైన్స్ కాలేజీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తరకం వంగడాల ప్రత్యేకతను వివరించారు. నూతనంగా విడుదల చేసిన కొత్త రకాల్లో వరిలో ఐదు (ఆర్ఎన్ఆర్ 11718, ఆర్ఎన్ఆర్ 15435, కేపీఎస్ 2874, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 962), జొన్నలో రెండు (ఎన్వీటీ 68, పీఎస్వీ 512) కంది (డబ్ల్యూఆర్జీ 255) పెసర (ఎంజీజీ 385), సోయా (ఏఐఎస్బీ 50), నువ్వులలో (జేసీఎస్ 2454) ఒక్కొటి చొప్పున కొత్త వంగడాలను విడుదల చేసినట్టు తెలిపారు. ఇవి ప్రస్తుత రకాలతో పోల్చితే అధిక దిగుబడి ఇవ్వడంతోపాటు చీడపీడలను తట్టుకునేశక్తి కలిగి ఉంటాయని చెప్పారు. వర్సిటీ ప్రాంగణంలో త్వరలో అగ్రిహబ్ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రైవేటు కాలేజీకి కూడా వ్యవసాయకోర్సులు నిర్వహించేందుకు అనుమతిలేదని వీసీ మరోసారి స్పష్టంచేశారు.