పని ప్రదేశంలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
45 ఏండ్లు పైబడిన కూలీలందరూ టీకా వేయించుకోవాలి
గ్రూప్ ఒక్కరికి పాజిటివ్ వచ్చినా… అందరికీ పరీక్షలు
ఉపాధి కూలీలు జాగ్రత్తలు పాటించాలి : డీఆర్డీవో ఉపేందర్రెడ్డి
ఆలేరు టౌన్, ఏప్రిల్ 22 : రెండో దశ కొవిడ్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఉపాధి హామీ సిబ్బందికి, కూలీలకు ప్రత్యేక నియమావళి జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లాలో 421 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 3,33,205 మంది కూలీలుగా నమోదు చేసుకున్నారు. 1,53,637 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. కూలీలు పని చేసే ప్రదేశంలో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించింది. ఇక నుంచి ఉపాధి హామీ కూలీలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. లేదంటే వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాలని ఆంక్షలు విధించారు. పనికి వచ్చే ముందు మాస్కులు, రుమాలు ధరించడం తప్పనిసరి. కూలీలు ఒకే చోట పనులు చేయడం వల్ల వైరస్ సోకే అవకాశం ఉంది. ఏ ఒక్కరికి లక్షణాలు ఉన్నా మిగతా కూలీలకు ఇబ్బందే. అయితే ఒక గ్రూప్లో ఒకరికి కొవిడ్ లక్షణాలు ఉండి, పాజిటివ్ అని తేలితే, ఆ గ్రూప్లోని మిగతా సభ్యులకు పరీక్షలు చేయాలి. అయితే ఎట్టి పరిస్థితిలోనూ ఆ గ్రామంలో పనులను నిలిపివేయవద్దు.
జాగ్రత్తలు పాటించాలి ఉపేందర్రెడ్డి, డీఆర్డీవో
ఉపాధి హామీ కూలీలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొవిడ్ నిబంధనలు పాటించాలి. ఇందుకు సంబంధించి ఏపీవోలు, గ్రామ కార్యదర్శులు వారికి అవగాహన కల్పిస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ అందరికీ పనులు కల్పిస్తున్నాం. కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. తప్పనిసరిగా మాస్కులు, రుమాలు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి.