హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. జూన్ 1న ప్రారంభమైన ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 1,035.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ స్థాయి (764.4 మి.మీ.) కంటే 35% అధికం. సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, నారాయణపేట, కరీంనగర్ జిల్లాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట, ములుగు, నాగర్కర్నూలు, మంచిర్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గత సీజన్లో (2020 జూన్ నుంచి 2021 మే వరకు) రాష్ట్రంలో 1,096.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.