సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అగ్రభాగాన నిలుస్తున్న ఓ గ్రామం కరోనా వ్యాక్సినేషన్లోనూ ఆదర్శంగా నిలిచింది. ఆ ఊరిలో 45 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవడం విశేషం. దీంతో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ జరిగిన పల్లెగా వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం నిలిచింది. టీకాపై అపోహలను తొలగించేందుకు తొలుత సర్పంచ్ అల్లం బాలిరెడ్డి వ్యాక్సిన్ వేసుకొన్నారు. ఇల్లిల్లూ తిరిగి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి ప్రజలను చైతన్యం చేశారు. తదుపరి దశలో ఇంటింటి సర్వేచేసి.. 314 మంది టీకా వేసుకొనేందుకు అర్హులున్నట్టు గుర్తించారు. వ్యాక్సిన్ సెంటర్ వరకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేసి విడతలవారీగా టీకా రెండు డోసులు వేసుకొనే ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు.
వరంగల్ రూరల్, మే 17 (నమస్తేతెలంగాణ): వ్యాక్సినేషన్లో వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలంలోని మరియపురం ఆదర్శంగా నిలిచింది. 45 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవడంతో వందశాతం టీకా వేసుకున్న గ్రామంగా గుర్తింపు పొందింది. కరోనా కట్టడికి ప్రభుత్వం 45 ఏండ్లు పైబడినవారికి టీకా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో మరియపురం సర్పంచ్ అల్లం బాలిరెడ్డి తమ గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేలా ప్రణాళిక తయారుచేశారు. ఇల్లిల్లూ తిరిగి అర్హత గలవారు 314 మంది ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో టీకాపై అపోహలున్నందున తొలుత సర్పంచ్ అల్లం బాలిరెడ్డి గీసుగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో మార్చి 6న వాక్సిన్ వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ‘మన ఊరు మరియపురం’ పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపు ద్వారా గ్రామస్థులకు తెలియజేశారు. టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి హాని లేదని, వ్యాక్సిన్ వేసుకుంటే వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కొందరికి సంబంధిత డాక్టర్ల ద్వారా కరోనా టీకా వేసుకోవచ్చని చెప్పించారు. అందరిలోనూ వ్యాక్సిన్పై భరోసా కల్పించారు. ఫలితంగా గ్రామస్థులు వ్యాక్సిన్ వేసుకొనేందుకు గీసుగొండ పీహెచ్సీ బాట పట్టారు. ఇలా గ్రామస్థులకు నచ్చజెప్తూ పీహెచ్సీకి పంపిన సర్పంచ్ బాలిరెడ్డి.. మొదట 60 ఏండ్లు పైబడినవారు గీసుగొండ పీహెచ్సీకి వెళ్లి వచ్చేందుకు మార్చి 24, 25 తేదీల్లో ఒక బస్సు, మినీ వ్యాన్ సమకూర్చారు. మొదటి రోజు 60, రెండో రోజు 60 మందికి దగ్గరుండి తొలి డోస్ వేయించారు. కొందరు స్వచ్ఛందంగానూ టీకా తీసుకున్నారు.
ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు పైబడినవారికి వ్యాక్సిన్ వేసే రెండో దశ కార్యక్రమం అమలులోకి వచ్చింది. రెండో విడుతలోనూ అర్హులను గుర్తించిన సర్పంచ్.. వారు కూడా వ్యాక్సిన్ వేసుకునేలా మరో ప్రణాళిక రూపొందించారు. ఏప్రిల్ 4, 5 తేదీల్లో గ్రామం నుంచి గీసుగొండ పీహెచ్సీకి వెళ్లి వచ్చేందుకు ఒక బస్సు, మినీ వ్యాన్ ఏర్పాటుచేశారు. తొలిరోజు 60 మంది, రెండోరోజు 60 మంది, మరో 54 మంది 15వ తేదీన వ్యాక్సిన్ వేసుకున్నారు. దీంతో మరియపురంలో వ్యాక్సిన్ వేసుకున్నవారి సంఖ్య 314కు చేరింది. సర్పంచ్ బాలిరెడ్డి చొరవతో అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవడంతో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయిన మొదటి గ్రామంగా మరియపురం రికార్డుల్లో చోటుచేసుకున్నది. కొద్దిరోజుల క్రితం మరియపురంవాసులు రెండో డోస్ కూడా తీసుకున్నారు.
కరోనా తమలో ఎవరికీ సోకవద్దనే లక్ష్యంతో మరియపురంవాసులు సమిష్టిగా ముందుకెళ్తున్నారు. మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తున్నారు. ప్రధానంగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేస్తున్నారు. ప్రధాన కూడళ్లు శానిటైజ్ చేస్తున్నారు. గ్రామంలో విందులు, బహిరంగ ధూమ, మద్యపానం నిషేధించారు. ప్రజల్లో రోగనిరోధకశక్తి పెరిగేందుకు నిర్మల ట్రస్ట్ ద్వారా యోగా టీచర్లు ఆసనాలు వేయిస్తున్నారు. ఇదే ట్రస్ట్ నుంచి వైద్యులు పరీక్షలు జరిపి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ప్రజలు ఎవరూ చికిత్స కోసం దవాఖాన మెట్లు ఎక్కవద్దనే ఆలోచనతో ఉన్నారు. నియంత్రణ చర్యలతో ఇప్పటివరకు మరియపురంలో కరోనా మరణం చోటుచేసుకోలేదు.
ప్రభుత్వం చెప్పింది చేయడం మా ఊరి ప్రజలకు అలవాటు. 45 ఏండ్లు పైబడినవారు వ్యాక్సిన్ వేసుకోవాలనగానే మొదట నేను టీకా వేసుకున్న. ఎలాంటి భయం లేదని భరోసా ఇవ్వడంతో గ్రామస్థులంతా ముందుకొచ్చారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, ఆవిరి పట్టడం అందరికీ అలవాటైంది. మా ఊరిలో కరోనా మరణాలు లేవు. ఇక్కడి నుంచి ఎవరికీ దవాఖానకు పోవాల్సిన అవసరం రాలేదు. కొద్దిరోజుల క్రితం గ్రామంలో ఇంటింటా జ్వర సర్వే జరిగింది. ఆరోగ్య సమస్యలున్నవారికి మెడికల్ కిట్లు అందజేశాం. చర్చి, దేవాలయాల్లో ప్రార్థనలు నిలిపివేశాం. ప్రజల ఆరోగ్యం కాపాడటం నా బాధ్యతగా భావిస్తున్న. – అల్లం బాలిరెడ్డి, సర్పంచ్, మరియపురం
ప్రజలు కరోనా బారిన పడొద్దని మా ఊరి సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అతను చైర్మన్గా వ్యవహరిస్తున్న నిర్మల ట్రస్ట్ ద్వారా గ్రామంలో కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ పవర్ పెరిగేలా గ్రామస్థులతో యోగా చేయిస్తున్నారు. వైద్యులతో పరీక్షలు జరిపించి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వెంటనే చికిత్స, మందులు ఇప్పిస్తున్నారు. – అల్లం చిన్నపరెడ్డి, మరియపురం గ్రామస్థుడు
కరోనాను కట్టడిలో మరియపురం రాష్ట్రంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని చెప్పవచ్చు. సర్పంచ్ బాలిరెడ్డి గ్రామం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంట్లోనే ఉండేలా మందులు, పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను ఉచితంగా సమకూర్చుతున్నారు. సర్పంచ్కు అభినందనలు.
బేతినేని వీరారావు, ఎంపీటీసీ, మరియపురం
నిర్మల ట్రస్ట్లో యోగా టీచర్గా పనిచేస్తున్నాను. కరోనాను ఎదుర్కొనేందుకు రోజూ గ్రామంలో 30 మంది మహిళలతో యోగా చేయిస్తా. మరో 30 మంది వృద్ధులకు ఫిజియోథెరపీ చేస్తా. వీటితో ఫిట్నెస్తోపాటు వైరస్ను తట్టుకొనే శక్తి కూడా పెరుగుతుంది. మా ఊరిలో అర్హులంతా వ్యాక్సిన్ వేసుకొని స్థానికులకు ధైర్యాన్ని ఇచ్చారు.
గోపు జ్యోతి, యోగా టీచర్