బీజింగ్: ఒకవేళ తమ కార్లు గూఢచర్యానికి పాల్పడితే టెస్లా కంపెనీని మూసివేస్తామని గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సవాల్ చేశారు. చైనాలోని మిలిటరీ కేంద్రాల పరిధిలో టెస్లా కార్యక్రమాలను నిషేధించినట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో ఎలన్ మస్క్ శనివారం తొలిసారి స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
ఇది మాకు చాలా ప్రోత్సాహకరం. ఎటువంటి సమాచారం అయినా చాలా కాన్ఫిడెన్షియల్ అని చైనా సంస్థ నిర్వహించిన వర్చువల్ సెమినార్లో మస్క్ వ్యాఖ్యానించారు. చైనాలో మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా టెస్లా కార్లు నిఘా చర్యలు చేపట్టినట్లు రుజువు చేసినా తమ కార్ల తయారీ సంస్థను మూసేస్తామని స్పష్టం చేశారు.
టెస్లా సంస్థ తన కార్లలో కెమెరాలను ఇన్స్టాల్ చేసిందని, దీనివల్ల తమ భద్రతకు ముప్పు ఉందన్న పేరుతో ఆ సంస్థ కార్లను తమ కాంప్లెక్స్ల్లోకి ప్రవేశించడానికి వీల్లేదని చైనా మిలిటరీ నిషేధాజ్ఞలు విధించినట్లు శుక్రవారం రాయిటర్లో వార్తాకథనం ప్రచురితమైంది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు దేశాల మధ్య వివాదాస్పద అంశాలను పరిష్కరించుకునే విషయమై ఇరు పక్షాల అగ్రశ్రేణి దౌత్యవేత్తలు అలస్కాలో తొలిసారి ముఖాముఖీ చర్చలు జరుపుతున్న వేళ ఈ ఆరోపణలు రావడం గమనార్హం.
ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలుగా పేరొందిన అమెరికా, చైనా మధ్య పరస్పర విశ్వాసం అవసరం అని ఎలన్ మస్క్ అభ్యర్థించారు. ఈ వర్చువల్ సదస్సును చైనా విదేశాంగశాఖ మండలి ఆధ్వర్యంలోని ఫౌండేషన్ సంస్థ నిర్వహించింది. ఎలన్మస్క్తోపాటు సౌత్రన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధిపతి, క్వాంటం ఫిజిక్స్ శాస్త్రవేత్త జూ ఖ్వికున్ కూడా పాల్గొన్నారు.
చైనా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కార్ల మార్కెట్గా నిలిచింది. ప్రత్యేకించి విద్యుత్ కార్ల విక్రయానికి వివిధ కార్ల సంస్థల మధ్య పోటీ నడుస్తున్నది. గతేడాది టెస్లా 1,47,445 విద్యుత్ కార్లను విక్రయించింది. అయినప్పటికీ ఈ ఏడాది చైనాకు చెందిన నియో ఇంక్ నుంచి గీలీ సంస్థల నుంచి టెస్లా గట్టి పోటీనెదుర్కొంటున్నది.