హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు జోరందుకున్నది. ప్రైవేటు కంపెనీలు ఆయా జిల్లాల్లో నర్సరీలను ఏర్పాటుచేసి రైతులకు మొక్కలు అందజేసే చర్యలు తీసుకుంటున్నాయి. పంట చేతికొచ్చే సమయం వరకు కంపెనీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ ప్రక్రియలో తెలంగాణ ఆయిల్ఫెడ్ ముందువరుసలో ఉన్నది. ఆయిల్ఫెడ్కు ప్రభుత్వం గతంలోనే కేటాయించిన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతోపాటు, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్ జిల్లాల్లో 2.5 లక్షల ఎకరాల విస్తీర్ణాన్ని కేటాయించింది. సంస్థకు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేటలో రెండు పామాయిల్ ఫ్యాక్టరీలు ఉండగా.. కొత్తగా కేటాయించిన జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున ఐదు ఫ్యాక్టరీల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి స్థలాల పరిశీలన కూడా పూర్తయింది. ఒక్కోఫ్యాక్టరీ నిర్మాణానికి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది. ముందుగా ప్రతి గంటకు 30 టన్నుల ఆయిల్ ప్రాసెసింగ్ కెపాసిటీతో ఏర్పాటుచేసి క్రమంగా 60 టన్నుల సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించారు. పంట చేతికొచ్చే ఏడాది ముందుగానే పరిశ్రమ ఏర్పాటయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
మొక్కల పెంపకం షురూ
వచ్చే మూడేండ్లలో రాష్ట్రంలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం 10 కంపెనీలకు జిల్లాలను కేటాయించి సాగువిస్తీర్ణాన్ని నిర్ణయించింది. కంపెనీలు ముందుగా నర్సరీలను ఏర్పాటుచేసి రైతులకు మొక్కలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రైవేటు కంపెనీలు అన్నీ కలిసి 45 లక్షలకుపైగా మొక్కల పెంపకాన్ని ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ఆయిల్ఫెడ్ కొత్తగా కేటాయించిన ఐదుజిల్లాల్లో 15 వేల ఎకరాల్లో సాగుకు మొక్కలను అందజేసింది. వచ్చే ఏడాది 35 వేల ఎకరాల్లో సాగును విస్తరించేలా ప్రణాళికలు రూపొందించింది. ఆయిల్పామ్ సాగుపై విస్తృతమైన ప్రచారం జరుగుతుండటంతో రైతులు దాని సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 49 వేల ఎకరాల్లో సాగవుతుండగా ఈ ఒక్క ఏడాదే 10 వేల ఎకరాలు కొత్తగా పెరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
రెండేండ్లలో ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి
ప్రభుత్వం కేటాయించిన ఐదు జిల్లాల్లో ఆయిల్పామ్ సాగును విస్తృతంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మొక్కల పెంపకం ప్రారంభించాం. వచ్చే రెండేండ్లలో ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి చేస్తాం. ఆయిల్పామ్కు మంచి ధర లభిస్తున్న నేపథ్యంలో ఆయిల్సాగు లాభాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.