హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడంలో రాష్ట్రం ముందంజలో ఉన్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల్లోనే 10 కోట్ల పనిదినాలను కల్పించింది. ఈ ఏడాది లక్ష్యంలో ఇప్పటికే 77 శాతం పూర్తయింది. ఏప్రిల్ ఫస్ట్ నుంచి జూలై 12 వరకు 10.05 కోట్ల పనిదినాలను కల్పించింది. అందరికీ పని దొరికేలా రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టారు. ఒకవైపు వ్యవసాయ పనులు కొనసాగుతున్నప్పటికీ సోమవారం ఒక్కరోజే 2.64 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. 2021-22లో 13 కోట్ల పనిదినాలు లక్ష్యం కాగా ఇప్పటికే 10.05కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. ఏప్రిల్లో 2.86 కోట్లు, మేలో 3.95 కోట్లు, జూన్లో 2.91 కోట్లు, జూలై 12 వరకు 33 లక్షలు పనిదినాలను కల్పించారు. 12,771 గ్రామాల్లో 12,272 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. లక్ష కుటుబంబాలకు ఇప్పటికే వంద రోజుల పని కల్పించడం పూర్తయింది. సోమవారం సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 29,659, నిజామాబాద్లో 21,587, మహబూబ్నగర్ 20,353, సిద్దిపేటలో 17,619, నల్లగొండలో16,173 మంది పనులకు హాజరయ్యారు. సగటున ఒక్కో కూలీకి రోజుకు రూ.168 చెల్లిస్తున్నారు.
ముందంజలో తెలంగాణ
దేశంలో ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందంజలో నిలుస్తున్నది. ఉపాధి హామీ ద్వారా నీటి వనరుల సంరక్షణ, మొక్కల పెంపకం, ఇతర సహజ వనరులను సంరక్షించే పనులు చేపడుతున్నారు. వీటితోపాటు అసంపూర్తిగా ఉన్న రైతు కల్లాలు, గ్రామ పంచాయతీ భవనాలు, వైకుంఠధామాలు, సోక్పిట్లు, అంగన్వాడీ భవనాలు, ఫీడర్ చానల్స్ నిర్మాణం, భూమిని చదును చేయడం, నర్సరీల్లో మొక్కల పెంపకం తదితర పనులు ఉపాధి హామీ కింద నిర్వహిస్తున్నారు. కాంటూర్ కందకాలు, నీటి కాల్వ కందకాలు, పంట పొలాలకు ఫీడర్ కాలువల పనులు చేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల పనిదినాలను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరగా.. ముందుగా 13 కోట్లకు అనుమతులు మంజూరు చేసింది. ఆ పనులు పూర్తయ్యాక అవసరమైన మేరకు మరిన్ని మంజూరు ఇస్తామని కేంద్రం తెలిపింది. కొద్దిరోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసి అదనంగా పని దినాలు కల్పించే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తున్నది.